Jabardasth fame Dhanaraj got Emotional while Telling about his Mother
Dhanaraj Emotional : జబర్దస్త్ తో, సినిమాలతో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారి రామం రాఘవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధనరాజ్ వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
ధనరాజ్.. వాళ్ళ నాన్న సినిమాల్లో ఇంకా ఛాన్సులు రాకముందే చనిపోయాడు అని, సినిమాల కోసం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాను అని, ఛాన్సులు వెతుక్కుంటూ హైదరాబాద్ లో ఒక హోటల్ లో వెయిటర్ గా చేస్తుంటే వాళ్ళ ఊరి వ్యక్తి చూసి వెళ్లి చెప్పాడని, వాళ్ళ అమ్మ వచ్చి బాగా ఏడ్చిందని, ధనరాజ్ కోసం వాళ్ళ అమ్మ ఇక్కడే ఉండిపోయిందని తెలిపాడు.
వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ.. నా కోసం ఇక్కడికి వచ్చేసాక మా అమ్మ అపోలో హాస్పిటల్ లో ఆయాగా పనిచేసేది. నేను ఇంకా ఛాన్సులు వెతుక్కుంటూ ఉండేవాడిని. కొన్ని రోజులు మా అమ్మే నన్ను పోషించింది. బ్యాక్ గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేశాను. కానీ నా మొదటి సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’. 2004 లో నా మొదటి సినిమా జై రిలీజయింది. ఆ సినిమాకు మా అమ్మను తీసుకెళ్ళాను. టోలి చౌక్ గెలాక్సీ థియేటర్ లో సినిమా చూసాం. ఆ సినిమాలో నన్ను పొడిచే సీన్ ఉంటుంది. అది నిజమే అనుకోని నీకేమన్నా అయిందా, నిజంగా పొడిచారా, ఏది చూపించు అని సినిమా అయిపోయి ఇంటికొచ్చేదాకా ఎమోషనల్ అయింది అని తెలిపాడు.
అలాగే.. అప్పటికే మా అమ్మ క్యాన్సర్ నాలుగవ స్టేజిలో ఉంది. అంతకు ముందు నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నా మొదటి సినిమా జై చుసిన కొన్ని రోజులకే అమ్మ క్యానర్ తో చనిపోయింది. నేను నటించిన మొదటి సినిమా అమ్మ చూసిన చివరి సినిమాగా మిగిలింది అంటూ ఎమోషనల్ అయ్యాడు ధనరాజ్. అయితే వాళ్ళ అమ్మ చివరి దశలో ఉన్నప్పుడే తన భార్య శిరీష పరిచయం అయిందని, ఆ సమయంలో తనకు బాగా సపోర్ట్ గా నిలిచిందని, అమ్మ చనిపోయాక అమ్మలా నా జీవితంలోకి వచ్చిందని తన భార్య గురించి కూడా చెప్పాడు.
1998 లోనే సినిమాల మీద ఇష్టంతో హైదరాబాద్ వచ్చేసిన ధనరాజ్ కి 2004 లో జై సినిమాతో గుర్తింపు వచ్చింది. 2007 లో జగడం సినిమాతో పాపులర్ అవ్వడంతో అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇన్నాళ్లు కమెడియన్ గా మెప్పించిన ధనరాజ్ మధ్యలో నిర్మాత అయి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మారి ఓ ఎమోషనల్ సినిమాతో రాబోతున్నాడు.