Latha Mangeshkar: మాయదారి మహమ్మారి కరోనా మరో భారత ఆణిముత్యాన్ని మనకి దూరం చేసింది. గానకోకిలగా యావత్ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నట్లుగా ప్రకటించినా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్సకి రెస్పాండ్ కాలేక మృతి చెందారు.
Lata Mangeshkar: విషాదం.. లతా మంగేష్కర్ కన్నుమూత
భౌతికంగా లతాజీ మనకి దూరమైనా ఆమె మనకి అందించిన గీతా వసంతాలు తరగని జ్ఞాపకాలు. ప్రేక్షకులకు ఆట కావాలి. పాట కావాలి. స్వరాల సయ్యాట కావాలి. వెండితెరమీద రంగుల హరివిల్లు విరియాలి. కళాఖండాలిచ్చే వారికి కనకవర్షం కురియాలి. అందుకే సినీ ప్రపంచం పాటనే నమ్ముకుంది. కథానాయకులకు ఎందరు గాయకులు పాటలు పాడినా.. కథా నాయికలకు లతమ్మ లేనిదే గొంతు పెగలదు. మనవరాలి వయసులో ఉన్న కుర్ర హీరోయిన్లకు లతామంగేష్కర్ వేలాది పాటలిచ్చారు. ఆమె తరతరాల హీరోయిన్లకు తీయని గళమిచ్చారు. అందుకే దర్శకులు లత ఒక్క పాటైనా పాడాలని ఇంటికి బారులుతీరారు.
Latha Mangeshkar: స్వరరాగ గంగా ప్రవాహం ఆమె ప్రయాణం!
తొలి సినిమాలో నటించే హీరోయిన్లు తొలి పాట లతమ్మదే కావాలని పట్టుపట్టేవారు. వందలాది కథానాయికలకు వేయి గొంతుకల పాట లతా మంగేష్కర్. లత పాటల వర్షానికి సంగీత ప్రపంచంలో ఓ వరదను తలపించేది. నార్త్ నుండి సౌత్ వరకు.. సీనియర్లు జూనియర్లు అని లేకుండా అందరి హీరోల సినిమాలలో లతమ్మా గొంతు వినిపించాలి.. స్టార్లు.. ఫ్రెషర్లు అని కాకుండా అందరు హీరోయిన్లకు లతమ్మా గొంతే అరువు కావాలి. సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకుంటే.. నటీనటులు ఆమె గొంతు తెచ్చిన విజయంతో నక్షత్రాలై కనిపించేవారు.
Latha Mangeshkar: నింగికేగిన స్వర శిఖరం.. స్ఫూర్తి గీతానికి తానే ఆదర్శం!
లతా గాత్రానికి ఉన్న మ్యాజిక్ తెలిసిన గీత రచయిత జావేద్ అక్తర్.. అప్పటికి ఇప్పటికీ ‘భూమికి ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు. ఒకే లతామంగేష్కర్’ అని ప్రశంసిస్తుంటారు. లతామంగేష్కర్ దాదాపు 170 మంది సంగీత దర్శకుల వద్ద 36 దేశ, విదేశీ భాషలలో కూడా పాటలు పాడగా ఆమె పాటలు చెవుల్లో అమృతాన్ని పోసినట్టుగా.. యుగళగీతాలకు భూదేవి మురిసి తానే హరివిల్లైనట్లుగా.. స్వరాలన్నీ ఝరిలా ప్రవహించి పండు వెన్నెల్లో స్నానించి రాగ సుగంధ పరిమళాలతో స్పర్శించి రస హృదయాలను ఆనంద డోలికల్లో మునిగి తేలేలా పరవశింపజేస్తుంది.
Lata Ji : లతా మంగేష్కర్ తొలి పాట ఇదే?
వెండితెరమీద స్వరాల సయ్యాట ఆమె పాట.. పాటకు లత గానం ఓ ప్రాణం.. ఆ సేతు హిమాచలం లత పాటల పల్లకిలో విహరిస్తూ ఆస్వాదిస్తోంది. దశాబ్దాల ఆమె సుదీర్ఘ సంగీత యాత్రలో రవళించిన గీతికలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆ చంద్రతారార్కం వన్నె తగ్గని ఆమె పాటల్లో వెన్నెల వర్షిస్తూనే ఉంటుంది. గీతానికి తన స్వరంతో ప్రాణ ప్రతిష్ఠ చేసే లతాజీకి వయస్సు పెరిగినా ఆమె స్వరంలో మాధుర్యం మాత్రం ఎన్నటికీ తరిగేది కాదు.. అందుకే మనవరాలి వయస్సు వారికి పాడినా స్వరరస మాధుర్యంలో తీయదనం తరిగేది కాదు. జీవన ప్రయాణంలో ఒడిదుడుకులు.. గాన సామ్రాజ్యంలో మెళకువలె కాదు.. గాత్రంలో మార్పులేని.. రాజీలేని నభూతో నభవిష్యతి అనే విధంగా సంరక్షించుకోవడం భావి తరాలకు పెద్దబాల శిక్ష లాంటిదే.