Allu Arjun : అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు (సోమవారం) విచారణ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Published On : December 30, 2024 / 11:06 AM IST
Nampally Court will be hearing Allu Arjun bail petition Today
సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు (సోమవారం) విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై పోలీసులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేయనున్నారు. గత శుక్రవారం (డిసెంబర్ 27న) జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో నాంపల్లి కోర్టు నేటికి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోను సంధ్య థియేటర్లో వేశారు. ఆ సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
హోటల్ గదిలో విగతజీవిగా కనిపించిన సినీనటుడు
నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాదులు వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. కాగా.. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు డిసెంబర్ 27న ముగియడంతో వర్చువల్గా నాంపల్లి కోర్టుకు హాజరు అయ్యారు అల్లు అర్జున్.
హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపారు అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు. అదే సమయంలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయంలో కోరడంతో నేటికి వాయిదా పడింది.
మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసు విచారణను నాంపల్లి కోర్టు జనవరి 10 కి వాయిదా వేసింది. కాగా.. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ప 2 టీమ్ రూ.2 కోట్ల సాయం అందించింది. అల్లు అర్జున్ కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు అందించారు.
