యంగ్ టైగర్ ఎన్టీఆర్, దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ తెలుగు వెర్షన్ కోసం ఓ పాట పాడనున్నాడు..
జూనియర్ ఎన్టీఆర్.. మల్టీటాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. మంచి నటుడు, సూపర్బ్ డ్యాన్సర్, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యే అతని డెడికేషన్.. అప్పుడుప్పుడూ గొంతు సవరించుకుని అభిమానులను, ప్రేక్షకులను అలరించిన యంగ్ టైగర్.. త్వరలో తనలోని గాయకుణ్ణి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్తో ఒక పాట పాడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తమిళంలో దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు. ఇటీవల చిత్రంలో ‘కుట్టి స్టోరీ’ పాట విడుదల చేశారు. ఇంతకు ముందు ‘త్రీ’ చిత్రం కోసం అనిరుధ్ స్వరపరిచిన ‘వై థిస్ కొలవెరి డీ’ తరహాలో ఈ పాట కూడా ఎక్కువగా ఇంగ్లీష్ పదాలతో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అందరికీ అర్థమయ్యేలా సాగింది.
అరుణ్ రాజా కామరాజ్ లిరిక్స్ అందించగా ‘లెట్ మి సింగ్ ఎ కుట్టీ స్టోరీ’ అంటూ హీరో విజయ్ స్వయంగా పాడిన ఈ పాట గతకొద్ది రోజులుగా ట్రెండింగ్లో ఉంది. తెలుగులో ‘మాస్టర్’ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు విడుదల చేయనున్నారు. ఆయన ఎన్టీఆర్ చేత ‘కుట్టీ స్టోరీ’ పాడించాలనుకుంటున్నాడట.
ఈ మేరకు తారక్ని కలిసి రిక్వెస్ట్ చేయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల్లో పాటలు పాడిన తారక్.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘చక్రకవ్యూహ’ మూవీలో ‘గెలయా గెలయా’ అనే పాట పాడి సెన్సేషనల్ సింగర్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.