Paruchuri Venkateshwara Rao Son Sudarshan Introduced As Hero
Paruchuri Brothers: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా పరుచూరి బద్రర్స్కు ఎలాంటి క్రేజ్, ఇమేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు అయిన పరుచూరి సుదర్శన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ‘సిద్ధాపూర్ అగ్రహారం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. వాసు తిరుమల, ఉష శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శ్రీపాద దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ప్రముఖ దర్శకులు బి.గోపాల్ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్ను చిత్రయూనిట్కు అందజేశారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ఇతర ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య , వీరూ పొట్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Paruchuri Venkateswararao : మా అన్నయ్య అలా ఎందుకు అయిపోయాడంటే
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఏ రైతైనా తన కొడుకు చేతికి నాగలి ఇవ్వాలనుకుంటాడు. మా నాన్నగారు అలానే అనుకున్నారు. కానీ మేం కలం పట్టుకున్నాం. నా కొడుకు రవీంద్రనాథ్ కూడా కలం పట్టుకున్నాడు. కానీ మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా క్లాప్ కొట్టించుకున్నాడు. సుదర్శన్ హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత గొప్ప విద్యావంతుడికైనా వినయం లేకపోతే అతని విద్య శోభించదు. అలాగే గర్వం మనల్ని వెనక్కి లాగుతుంది. ‘‘సిద్ధాపూర్ అగ్రహారం’’ టైటిల్లోనే సిద్ధా అని ఉంది. సిద్ధాపూర్ అగ్రహారం చిత్రం సుదర్శన్కు యాక్టర్గా మంచి జీవితాన్ని ప్రసాదించాలని.. అతడు అద్భుతమైన కథానాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. ‘‘పరుచూరి బ్రదర్స్ నాకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చారు. రవీంద్రనాథ్ కూడా మంచి అబ్బాయి. సుదర్శన్ హీరో అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా టైటిల్నే పవర్ ఉంది. సినిమా విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. మరో అతిథి వీరూ పొట్ల మాట్లాడుతూ.. ‘‘పరుచూరి బ్రదర్స్గారి దగ్గరపనితో పాటు వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో అన్ని రకాలుగా సుదర్శన్కు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో సుదర్శన్ మాట్లాడుతూ.. ‘‘నేను హీరో అవుదామని అనుకోలేదు. కానీ దర్శకుడు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. యాక్టర్గా మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. ‘సిద్ధాపూర్ అగ్రహారం’ మంచి సినిమా అవుతుందని, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఇక దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ.. ‘‘పరుచూరి బ్రదర్స్ నాకు ఎంతో స్ఫూర్తి. సిద్ధాపూర్ అగ్రహారం సినిమా హిట్ సాధిస్తుంది. ప్రీ-రిలీజ్, విజయోత్సవంలో మరిన్ని విషయాలను మాట్లాడతాను’’ అని అన్నారు.