Movie Theaters : ఇకపై బెనిఫిట్ షోలు ప్రదర్శించం.. షాక్ ఇచ్చిన తెలంగాణ థియేటర్స్.. నిర్మాతలు అలా చేయకపోతే..

తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Movie Theaters : ఇటీవల తెలంగాణ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు చూస్తున్నామని, మంచి సినిమాలు కూడా రావట్లేదని.. ఇలా పలు కారణాలతో పది రోజులు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.

అయితే థియేటర్స్, ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, పలువురు డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాలు పర్సెంటేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడా వారం వారంకు తేడా ఉండేలా, ఒక్కో సినిమాకు దాని బడ్జెట్ బట్టి పర్సెంటేజ్ ఉండాలని నిర్ణయించారు.

Also Read : Samantha : నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత పోస్ట్ ఎవరి కోసం?

అలాగే తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశం నిర్వహించి మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాతలు ఎగ్జిబిటర్లకు అనుకున్న విధంగా పర్సంటేజీలు ఇవ్వాలని, అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించమని, మల్టీఫ్లెక్స్ తరహాలోనే పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాల ప్రదర్శన చేస్తామని తెలిపారు. దీనిపై నిర్మాతలు జులై 1 లోపు ఏ విషయం చెప్పాలని గడువు ఇచ్చారు. అయితే వీటిల్లో కల్కి, పుష్ప2, గేమ్ చేంజర్, భారతీయుడు సినిమాలకు మినహాయింపు ఇచ్చారు.

అలాగే.. నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదని, గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దేశవ్యాప్తంగా మూతపడ్డాయని, కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు అంటూ బెనిఫిట్ షోలు, అదనపు షోలతో మోసాలకు పాల్పడుతున్నారు, ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు షోలు ప్రదర్శించం అని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నిర్ణయాలతో అటు నిర్మాతలు ఆలోచిస్తుంటే ఇటు హీరోల అభిమానులు బెనిఫిట్ షోలు లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ థియేటర్స్ తీసుకున్న నిర్ణయాలపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు