Movie Theaters: ఎట్టకేలకు మళ్ళీ తెలుగు సినిమా తెరతీయనుంది. కొద్దిరోజులుగా థియేటర్ల ప్రారంభంపై సందిగ్దత నెలకొనగా తాజాగా స్పష్టత వచ్చింది. తెలంగాణలో లాక్ డౌన్ తొలగింపుతో థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతి లభించగా మరో తెలుగు రాష్ట్రం ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కొత్త సినిమా విడుదలకు మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు ఏపీలో కూడా థియేటర్లను అనుమతి లభించింది.
తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లను తెర్చుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. మరోవైపు, థియేటర్ల పున:ప్రారంభంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించి టాలీవుడ్ నిర్మాతల మండలితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ భేటీలో థియేటర్ల విద్యుత్, నిర్వహణ ఛార్జీల రద్దు, పార్కింగ్ ఫీజు వసూలు సహా మరిన్ని రాయితీలపై చర్చ జరగగా సీఎస్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలై 8 నుంచి తెలంగాణలో 100 శాతం, ఏపీలో 50 శాతం సామర్ధ్యంతో షోస్ మొదలుకానున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్న క్రమంలో అసలు ఇప్పుడు థియేటర్లను తెరిచినా ప్రేక్షకులు వస్తారా అన్న ప్రశ్న థియేటర్ల యాజమాన్యంతో ఇండస్ట్రీనే కలవరపెడుతుంది. మరి ఒకటి, రెండు స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.