10th grade student gang-raped and murdered : ఉత్తరప్రదేశ్లో దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. పదోతరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. బలవంతంగా విష పదార్థం తినిపించడంతో బాధితురాలు మృత్యువాతపడింది. ఈ ఘటన మేరఠ్ జిల్లాలో చోటుచేసుకుంది.
సర్దానా ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన విద్యార్థిని గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
అంతటితో ఆగకుండా ఆమెకు విష పదార్థం తినిపించి పారిపోయారు. ఆ తరువాత ఆమె అతి కష్టంమీద ఇంటికి చేరుకుంది. గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి ఆమె మృతి చెందింది.
దీనిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.