కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాడగి తాలూకా, గుండెనహళ్లి క్రాస్ సమీపంలోని హావేరి వద్ద 48వ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున 3.45 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది మృతి చెందారు. 11 మంది స్పాట్లో మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అలాగే, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. టెంపో ట్రావెలర్ KA01AB4760లో మొత్తం 17 మంది ప్రయాణిస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. చించోల్లి మాయమ్మ దేవస్థానం నుంచి వచ్చి శివమొగ్గ జిల్లా యెమెహట్టి గ్రామం వైపు వెళ్తూ హైవే పక్కన ఆగి ఉన్న లారీని టెంపో ట్రావెల్ వాహనం ఢీ కొట్టింది.
లారీ కిందికి టెంపో ట్రావెల్ దూసుకుపోవడంతో మృతదేహాలు నుజ్జనుజ్జయ్యాయి. టెంపో ట్రావెల్ డ్రైవర్ అతివేగంగా నడపడం, అలాగే నిద్రమత్తులోకి జారుకోవడం ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు చెబుతున్నారు.
Also Read: ఢిల్లీ ఎయిర్పోర్టులో కూలిన రూఫ్.. కార్లు ధ్వంసం.. ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు