Kanpur Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 17మంది ప్రయాణికులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 20మందికి గాయాలయ్యాయి.

  • Updated on- June 9, 2021 / 10:49 AM IST

Kanpur Road Accident

Kanpur Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 20మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సచేంది ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు జేసీబీని ఢీకొట్టింది. ఆ తీవ్రతకు జేసీబీ రోడ్డు పక్కన పడిపోగా, బస్సు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. బస్సులోనే ప్రయాణికులంతా ఇరుక్కుపోయి, తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణికులతో ఉన్న బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరగ్గా.. ఆ సమయంలో బస్సు చాలా వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పునఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సీఎం యోగి విచారణకు ఆదేశించారు.