Patna
Patna Blasts 2013 నాటి పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 9 మంది దోషులకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 9మంది దోషుల్లోని నలుగురికి మరణశిక్ష,ఇద్దరికి 10ఏళ్ల జైలు శిక్ష,ఇద్దరికి జీవిత ఖైదు,ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఎన్ఐఏ కోర్టు.
కాగా,2013 అక్టోబర్-27న.. ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. సభా ప్రాంగణంలో మొత్తం ఆరు బాంబు పేలుళ్లు సంభవించగా అందులో రెండు బాంబులు మోదీ ప్రసంగ వేదికకు కేవలం 150 మీటర్ల లోపు దూరంలో పేలాయి.ఆఖరి బాంబు మోదీ సభ వద్దకు రావడానికి 20 నిమిషాల ముందు పేలింది. ఆ తర్వాత నాలుగు లైవ్ బాంబులు అధికారులు నిర్వీర్యం చేశారు. అయితే ఈ పేలుళ్లన్నీ మోదీ, బీజేపీ నాయకుల రాకకు ముందే జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం పట్నా రైల్వే స్టేషన్లోనూ పేలుళ్లు సంభవించాయి. ఇక,ఈ పేలుళ్ల ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 84 మంది గాయాలపాలయ్యారు.
2013 నవంబర్ 6న ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. 2014 ఆగస్టులో 11మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో 10మంది సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందినవారు. మరో వ్యక్తి మైనర్ కావడం వల్ల అతడిని మూడేళ్ల పాటు జువెనైల్ హోంలో ఉంచారు.
ఈ కేసులో 9 మంది-ఇంతియాజ్ అన్సారీ, ముజీబుల్లా, హైదర్ అలీ, ఫిరోజ్ అస్లాం, ఒమర్ అన్సారీ, ఇఫ్తేకర్, అహ్మద్ హుస్సేన్, ఉమైర్ సిద్ధిఖీ మరియు అజారుద్దీన్లను దోషులుగా నిర్ధారిస్తూ గత నెల 27న ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఫకృద్దీన్ అనే మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.