9 booked for over 400 forced religious conversions
Meerut: కొవిడ్ మహమ్మారి సమయాన్ని ఆసరగా తీసుకుని సుమారు 400 మందిని బలవంతంగా మతం మార్చారన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన తొమ్మిది మందిపై కేసు నమోదు అయింది. తమను బలవంతంగా మతం మార్చారని బాధితులే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం గమనార్హం. మీరట్కు సమీపంలోని మాలిన్ అనే గ్రామానికి చెందిన వీరు తాజాగా మీరట్లోని బ్రహంపుత్రి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు నమోదు చేశారు. వీరితో పాటు స్థానిక భారతీయ జనతా పార్టీ నేత కూడా ఉన్నారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థికంగా చితికిపోయిన ఉన్న తమకు తిండితో పాటు కొంత ఆర్థిక సాయం చేశారని, అయితే ఆ సమయంలోనే తమను హిందువుల నుంచి క్రిస్టియన్లుగా బలవంతంగా మతమార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. అయితే అప్పటి పరిస్థితి దృష్ట్యా తామేమీ మాట్లాడలేకపోయామని వాపోయారు. అయితే తాజాగా హిందూ దేవుళ్ల ఫొటోలు కనిపించకూడదని, వారికి పూజలు చేయకూడదని తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని పేర్కొన్నారు.
‘‘ఆధార్ కార్డుల్లో కూడా మా పేర్లు మార్చుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీపావళి రోజు మేము పూజలు చేయాలనుకున్నాం. దానికి వారు అడ్డుపడ్డారు. మా ఇళ్లను ధ్వంసం చేశారు, దేవతా విగ్రహాలు పగలకొట్టారు. హిందూ దేవుళ్లను పూజిస్తే కొడతామని, చంపేస్తామని బెదిరించారు’’ అని ఒక బాధితుడు ఆరోపించాడు. కాగా, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఛబిలి, బిన్వా, సర్దార్, నిక్కు, బసంత్, ప్రేమ, తిత్లి, రాణిలను నిందితులుగా పేర్కొన్నారు.