young man suicide : హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో విషాదం నెలకొంది. నిద్ర సరిగ్గా రావడం లేదని, పీడ కలలు వస్తున్నాయని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కులూ జిల్లాలోని బంజార్ ప్రాంతంలో యువకుడు(17) తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. యువకుడు 11వ తరగతి చదువుతున్నాడు. యువకుడికి గత ఏడు రోజులుగా నిద్ర సరిగ్గా రావడం లేదు.
రాత్రి సమయాల్లో భయపడుతూ లేచి కూర్చుంటున్నాడు. పీడకలలు పడుతున్నాయని ఆందోళన పడ్డాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి గదిలో సూసైడ్ నోట్ లభించింది. నిద్ర లేకపోవడం, పీడ కలలు పడటంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితుడు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. యువకుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తమ సోదరుడి మృతదేహం కనిపించిందని అతని సోదరి వెల్లడించారు.