Delhi Floods: ఢిల్లీలో వరదలకు బీజేపీ కుట్ర చేసిందట.. ఆప్ ఆరోపణలు
ఆప్ ఆరోపణలపై బీజేపీ గట్టిగానే బదులిచ్చింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చేసినట్లుగా, వరదల నుంచి ఆప్ తప్పించుకోవాలని చూస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తిప్పికొట్టారు
- tony bekkal
- Published On : July 15, 2023 / 07:57 PM IST
AAP vs BJP: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరభారతం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు వరద నీటిలో కొట్టుకుపోయినంత పనైంది. దేశ రాజధాని ఢిల్లీది అదే పరిస్థితి. ఈ వర్షాల కారణంగా యమునా నదిలో నీటిమట్టం రికార్డు స్థాయికి (208.66 మీటర్లు) చేరింది. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఢిల్లీలో వరదలు రావడం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసింది. బీజేపీ పేరు ఎత్తకుండా హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దేశ రాజధానికి అదనపు నీటిని విడుదల చేయడం ద్వారా ఢిల్లీని ముంచేసే కుట్ర జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరద పరిస్థితి నగరాన్ని ముంచేసే కుట్రని అన్నారు. “ఢిల్లీని ఉద్దేశపూర్వకంగా ముంచుతున్నారు. హత్నికుండ్ బ్యారేజీ నుంచి అదనపు నీటిని ఢిల్లీ వైపుకు మళ్లించారు. సుప్రీంకోర్టుతో సహా ఢిల్లీలోని అన్ని ముఖ్యమైన సంస్థలను ముంచడానికి కుట్ర జరిగింది” అని ఆయన అన్నారు. బ్యారేజీ నుంచి అదనపు నీటిని హర్యానాలోని పశ్చిమ కాలువకు, ఉత్తరప్రదేశ్లోని తూర్పు కాలువకు విడుదల చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
karnataka : చిరుతపులికే చుక్కలు చూపించాడు.. బైక్కి కట్టేసి అధికారులకు అప్పగించిన యువకుడు
‘‘యమునా నదిలో నీరు తగ్గుతోంది. మరో 12 గంటల్లో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభించనుంది. హత్నీకుండ్ బ్యారేజీ నుంచి మొత్తం నీటిని ఢిల్లీకి మాత్రమే ఎందుకు విడుదల చేశారన్నది పెద్ద ప్రశ్న. వేరే వైపునకు ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేదు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానాకు కాల్వలు వెళ్తున్నాయి. దీనికి హర్యానా సమాధానం చెప్పాలి. ఢిల్లీలో వరద పరిస్థితిని ఎలా నివారించగలం?” అని సౌరభ్ అన్నారు. ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి కూడా ఢిల్లీ వరదను బీజేపీ తెచ్చిన విపత్తని అన్నారు.
Uttar pradesh: మరో మూత్ర ఘటన.. దళిత స్నేహితుడితో గొడవపడి, అతడి చెవిలో మూత్రం పోశారు
కాగా, ఆప్ ఆరోపణలపై బీజేపీ గట్టిగానే బదులిచ్చింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చేసినట్లుగా, వరదల నుంచి ఆప్ తప్పించుకోవాలని చూస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తిప్పికొట్టారు. నీటిని విడుదల చేసినప్పుడు మొదట ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ గుండా వెళుతుందని, అనంతరం సముద్రంలో కలుస్తుందని హర్యానా వ్యవసాయ మంత్రి జై ప్రకాష్ దలాల్ సచ్దేవా అన్నారు. నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగిపోవడానికి మూలకారణం అక్రమ ఆస్తులు, ముంపు ప్రాంతాలలో నిర్మాణాలేనని ఆయన విమర్శలు గుప్పించారు.
