పేద కుటుంబాల దత్తతే నాకు ఇచ్చే నిజమైన గౌరవం…వైరల్ పోస్ట్ పై స్పందించిన మోడీ

భారత్‌లో కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి గౌరవార్థంగా ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5గంటల సమయంలో  దేశ ప్రజలంతా  తమ తమ ఇళ్లల్లోని బాల్కనీల్లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు నిల్చుని సంఘీభావాన్ని ప్రకటించాలని,మోడీకి సెల్యూట్ చేయాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రధాని మోడీ స్పందించారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనను వివాదాల్లోకి లాగేందుకు కొందరు అల్లరిమూకలు చేసిన పనిగా ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. అంతగా.. తనను గౌరవించాలనుకుంటే ఈ కష్ట కాలంలో ఒక పేద కుటుంబం ఆలనపాలన చూసుకునే బాధ్యతను తీసుకోవాలని ఆయన కోరారు. అలా చేయడానికి మించిన గౌరవం లేదన్నారు.

కరోనా కష్ట కాలంలో సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపే దృష్ట్యా చప్పట్లు కొట్టాలని.. కరోనా కట్టడికి దేశమంతా ఐక్యంగా ఉందని తెలిపేందుకు దీపాలు వెలిగించాలని ఇటీవల ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ భారతం జై కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీకి గౌరవం ఇవ్వాలంటే 5 నిమిషాల పాటు దేశప్రజలంతా నిల్చుని సంఘీభావం ప్రకటించాలని కొందరు సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ప్రధాని స్పందనతో ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమైంది.