After 24 Years Court Verdict : ఉత్తరప్రదేశ్లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 17, 1998న ఉత్తర ప్రదేశ్ మైన్పురిలోని ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర బాథమ్ జేబులో నుంచి ఎవరో డబ్బులు కొట్టేశారు.
లైన్గంజ్ ప్రాంతంలో చోరీ జరిగిందని గుర్తించిన అతను.. సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్ దొంగతనం చేసినట్టు గుర్తించారు. మన్నన్ను అదుపులోకి తీసుకొని.. అతను కొట్టేసిన 45 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మైన్పురిలోని సీజేఎం కోర్టు ఆదేశాలతో 1998 ఏప్రిల్ 18న మన్నన్ను జైలుకు పంపించారు.
మామిడిపండ్ల దొంగతనం కేసు 12 ఏళ్ల తర్వాత తీర్పు
విచారణ ఖైదీగా 81 రోజుల పాటు జైలులో ఉన్న మన్నన్ ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఆ కేసు అలాగే కొనసాగుతోంది. 24 ఏళ్లు అయినా దొంగతనం కేసు అలాగే నడుస్తుండటంతో ఎలాగైనా దీని నుంచి బయటపడాలని మన్నన్ భావించాడు. గత నెల 28న కోర్టుకు హాజరై.. దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతనికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.