Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది మృతి..! అహ్మదాబాద్ సీపీ సంచలన ప్రకటన..
విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు.
- Naveen
- Published On : June 12, 2025 / 06:11 PM IST
Ahmedabad Plane Crash: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా (242 మంది) చనిపోయి ఉంటారని ఆయన తెలిపారు. ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ సంచలన ప్రకటన చేశారు. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైపోయారని తెలుస్తోంది.
విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం ఎయిర్ పోర్టు సమీపంలోని మేఘానీనగర్ లో కూలింది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1.39 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ వెంటనే ఏటీసీ సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎయిర్ పోర్ట్ బయట ఫ్లైట్ కుప్పకూలింది. గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
