ఆలూ కర్రీ వద్దంటే భార్య చితకబాదిందని మొరపెట్టుకుంటున్న భర్త
- Subhan Ali Shaik
- Published On : August 11, 2020 / 08:41 AM IST
డయాబెటిక్ తో బాధపడుతున్న వ్యక్తి షుగర్ తో బాధపడుతూ బంగాళదుంప కూర వద్దన్నాడు. అంతే బ్యాట్ పట్టుకుని చితకబాదింది భార్య. అతని హెల్త్ కండిషన్ కు సెట్ అవదని డాక్టర్ బంగాళదుంప కూర తినకూడదని సూచించాడు. అయినా వినకుండా వేధిస్తుందని పోలీస్ స్టేషన్ కు వెళ్లి భార్యపై కంప్లైంట్ ఇచ్చాడు భర్త.
హర్షద్ గోహెల్ అనే వ్యక్తి అహ్మదాబాద్ లోని సరోయ్నగర్ లో ఉంటున్నాడు. అతని భార్య తారా గోహెల్ తరచూ గొడవపడుతుండేది. శుక్రవారం రాత్రి ఆమె డిన్నర్ లో బంగాళదుంప కూర వండింది. చపాతీలతో పాటు ఆలూ కర్రీ తినాల్సిందేనని చెప్పింది.
‘ఆ వంటకు నో చెప్పాను. అది హెల్త్ కు మంచిది కాదని తెలిసి ఎందుకు వండావని ప్రశ్నించా. అంతే ఇక తిట్టడం మొదలుపెట్టింది’ అని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. వద్దని అడ్డుకుంటుంటే వాష్ రూంలోకి వెళ్లి వాషింగ్ బ్యాట్ తీసుకువచ్చింది. దాంతో చితకబాదింది. కాపాడమని హర్షద్ ఏడుస్తుండగా అది విని కుటుంబ సభ్యులు వచ్చి అతణ్ని కాపాడారు.
అతణ్ని వీఎస్ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించారు. అతని కుడి భుజంపై గాయం అయినట్లుగా వైద్యులు తెలిపారు. దీనిని మెడికో-లీగల్ కేసు కింద రిజిష్టర్ చేశారు. వాస్నా పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. భర్తను గాయపరిచిన తారాపై కేసు బుక్ అయింది.
