Randeep Guleria Vaccine : రెండో డోసు ఆలస్యమైనా కంగారొద్దు..వ్యాక్సిన్ పని చేస్తుంది

తొలి డోసు టీకా తీసుకున్న వారు చాలామంది రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నారు. వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో ఆలస్యం అయిపోతోందని కంగారు పడుతున్నారు. ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే, పని చెయ్యదేమో అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. దీంతో కొందరు రెండో డోసు టీకా తీసుకోవడం మానేశారు.

Randeep Guleria Vaccine

Randeep Guleria Vaccine : కరోనా సమస్యకు ఏకైక పరిష్కారం వ్యాక్సిన్ మాత్రమే అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే ఒకే ఒక్క దారి వ్యాక్సినేషన్ అని స్పష్టం చేస్తున్నాయి. టీకా తీసుకున్నాక కరోనా సోకినా ఆసుపత్రి పాలయ్యే అవకాశం ఉండదని, ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు టీకాల కోసం ఎగబడ్డారు. ఫలితంగా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేము అని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఈ క్రమంలో తొలి డోసు టీకా తీసుకున్న వారు చాలామంది రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నారు. వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో ఆలస్యం అయిపోతోందని కంగారు పడుతున్నారు. ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే, పని చెయ్యదేమో అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. దీంతో కొందరు రెండో డోసు టీకా తీసుకోవడం మానేశారు.

దీనిపై ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పందించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడం కాస్త ఆలస్యమైనా కంగారు పడొద్దని ఆయన చెప్పారు. ఆలస్యమైనా రెండో డోసు టీకా పనిచేస్తుందని, ఎవరూ మానొద్దని సూచించారు.

‘‘కొవిడ్‌ వచ్చి తగ్గిన వారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. మెజార్టీ వైద్యులు మాత్రం లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక టీకా వేయించుకోవడం తప్పనిసరి. రెండో డోసు కొన్ని వారాలు ఆలస్యమైతే వ్యాక్సిన్‌ పనిచేయదని అనుకోవద్దు. ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్‌ ఎఫెక్ట్‌ ఇస్తుంది. ప్రస్తుతం వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో వైద్య వసతులపై ఒత్తిడి పెరిగింది. ఒక రోగి ఆక్సిజన్‌ కోసం ఆసుపత్రిలో చేరితే పది రోజుల వరకూ అక్కడే ఉండాలి. కానీ బయట బెడ్ల కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇప్పుడు మహమ్మారి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వ్యాపిస్తోంది” అని రణ్ దీప్ గులేరియా అన్నారు.

దశను బట్టి మందులు వాడాలి:
కొవిడ్‌లో రెండు దశలున్నాయి. ఏ దశలో వాడాల్సిన మందులు ఆ దశలోనే వాడాలి. అదే సమయంలో మందుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. మొదటి దశలో వైరస్‌ శరీరంలో విస్తరించి దగ్గు, జ్వరం, జలుబు వస్తాయి. లక్షణాలకు అనుగుణం ఇచ్చే చికిత్సతో చాలామంది కోలుకుంటారు. కొందరిలో వైరస్‌ ఊపిరితిత్తుల్లో ఎక్కువ వ్యాపిస్తుంది. అలాంటి వారిని రెండో దశ రోగులుగా గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించాలి. వారికి రెమ్‌డెసివిర్, ప్లాస్మా ఇస్తుంటారు. రెండో దశలో వైరస్‌ లోడు ఎక్కువగా లేకపోయినా, రోగనిరోధకశక్తి అస్తవ్యస్తంగా మారొచ్చు. అప్పుడు స్టెరాయిడ్స్, ఇతర మందుల అవసరం ఉంటుంది. మొదటి దశలో స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి… ఏ దశలో ఎలాంటి చికిత్స అందించాలన్న విషయమై గ్రామీణ వైద్యులకు మార్గదర్శకాలు పంపుతున్నాం. ఆసుపత్రుల్లో వసతులను పెంచుకుంటూనే కేసులను తగ్గించుకోవాల్సి ఉంది. ఇందుకోసం ‘బ్రేక్‌ ద చైన్‌’ ఉద్యమాన్ని మొదలుపెట్టాలి’’ అని ఆయన సూచించారు.

కొన్ని రాష్ట్రాల్లో మూడోదశ టీకా పంపిణీ: లవ్‌ అగర్వాల్‌
ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేసిన కొన్ని రాష్ట్రాల్లో… మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. తొలుత కొన్ని చోట్ల ప్రారంభమైనా, తర్వాత విస్తరిస్తుందన్నారు. ‘‘కేంద్రం ఇప్పటివరకు 15 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసింది. 45 ఏళ్లు దాటినవారికి ఇకపైనా ఉచితంగానే అందిస్తుంది’’ అని ఆయన చెప్పారు.

కాగా, దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో వైరస్ వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇన్ని అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు.

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 19,45,299 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,01,993 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.91కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరో 3వేల 523 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,11,853 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.11శాతంగా ఉంది. అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3లక్షల(2,99,988) మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.56కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.84శాతంగా ఉంది.

ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 32లక్షలు దాటాయి. ప్రస్తుతం 32,68,710 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 17.06 శాతానికి పెరిగింది. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 27లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటివరకు 15.49కోట్ల మంది టీకా పొందారు.