Jammu Kashmir: పాకిస్తాన్తో శాంతి చర్చలపై అమిత్ షా ఏమన్నారంటే?
మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదు. దానిని తుదముట్టిస్తుంది. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది మా లక్ష్యం. పాకిస్థాన్తో చర్చలు జరపాలని కొందరు అంటున్నారు. ఆ దేశంతో మనం ఎందుకు చర్చలు జరపాలి? మనం చర్చలు జరిపే ప్రసక్తే లేదు
- tony bekkal
- Published On : October 5, 2022 / 04:43 PM IST
Amit Shah rules out talks with Pakistan over J&K
Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బారాముల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెడుతుందని అన్నారు. దేశంలో అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మార్చుతుందని అమిత్ షా చెప్పారు.
జమ్మూ-కశ్మీరులో 1990వ దశకం నుంచి ఉగ్రవాదం వల్ల 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రవాదం వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? అని సభికులను ఉద్దేశించి అమిత్ షా ప్రశ్నించారు. జమ్మూ కశ్మీరు అభివృద్ధిలో వెనుకబడటానికి మూడు కుటుంబాలే కారణమని దుయ్యబట్టారు. అబ్దుల్లాలు (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు (పీడీపీ), నెహ్రూ-గాంధీలు (కాంగ్రెస్) వల్లే జమ్మూ కశ్మీర్ అభివృద్ధి చెందలేదని దుయ్యబట్టారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ కశ్మీరు రాష్ట్రాన్ని వీరే పరిపాలించారన్నారు. వీరి పాలన అవినీతిమయమని షా విమర్శలు గుప్పించారు.
‘‘మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదు. దానిని తుదముట్టిస్తుంది. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది మా లక్ష్యం. పాకిస్థాన్తో చర్చలు జరపాలని కొందరు అంటున్నారు. ఆ దేశంతో మనం ఎందుకు చర్చలు జరపాలి? మనం చర్చలు జరిపే ప్రసక్తే లేదు’’ అని అమిత్ షా అన్నారు. అమిత్ షా మంగళవారం నుంచి కశ్మీరులో పర్యటిస్తున్నారు. గురువారం కూడా కశ్మీరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Bihar: జేడీయూని లీడ్ చేయమని పీకేని కోరిన నితీశ్.. పీకే సమాధానం ఏంటంటే?
