Amritpal Singh: అమృత్పాల్ సింగ్ పంజాబ్ నుంచి పారిపోయాడా? పాక్, నేపాల్ సరిహద్దుల్లో అలర్ట్ ..
అమృత్ పాల్ పోలీసులు కళ్లుగప్పి మారువేషంలో పంజాబ్ నుంచి పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అతను దేశం వదిలిపోయేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు పంజాబ్ రాష్ట్ర సరిహద్దులతో పాటు, నేపాల్, పాకిస్థాన్లకు ఆనుకొని ఉన్న భారత సరిహద్దుల్లోకూడా నిఘాను పెంచారని వార్తలు వస్తున్నాయి.
- Harishth Thanniru
- Published On : March 21, 2023 / 11:59 AM IST
Amritpal Singh
Amritpal Singh: ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. నాలుగు రోజులుగా పోలీసులు కళ్లుగప్పి అమృత్ పాల్ తప్పించుకొని తిరుగుతున్నాడు. పంజాబ్ (punjab) మొత్తం హై అలర్ట్ (High alert) ప్రకటించారు. అడుగడుగునా పోలీసుల బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయినా, దొరికినట్లే దొరికి అమృత్ పాల్ సింగ్ తప్పించుకు పోతుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతని మద్దతు దారులను ఇప్పటికే 114 మంది అరెస్టు చేశారు. ఇప్పటి వరకు అమృత్ పాల్ పై విచారణలో దుబాయ్ లోని ఐఎస్ఐ (ISI) తో పరిచయం ఉన్నట్లు తేలిందని, అతనికి జార్జియాలో ఐఎస్ఐ ద్వారా శిక్షణ ఇవ్వబడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమృత్ పాల్ సింగ్ మామ హర్జిత్ సింగ్ (Harjit Singh) ను అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు పంజాబ్ మొత్తం హైఅలర్ట్ కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం వరకు పంజాబ్లోని తరన్ తరణ్, ఫిరోజ్పూర్, మెగా, సంగ్రూర్, అమృత్సర్లోని అజ్నాలా సబ్ డివిజన్, మొహాలీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మిగిలిన ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించనున్నారు.
Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట.. తీవ్రవాద కోణం ఉందా అని పోలీసుల అనుమానం?
అమృత్పాల్ పంజాబ్ నుంచి పారిపోయాడా?
అమృత్ పాల్ పోలీసులు కళ్లుగప్పి మారువేషంలో పంజాబ్ నుంచి పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో అతను పంజాబ్ సరిహద్దులు దాటినట్లు పోలీసుల వర్గాలుసైతం అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు అమృత్ పాల్ తప్పించుకోవడానికి సహాయం చేశారని తెలుస్తోంది. అయితే, పోలీసులు బెంజ్ కారు స్వాధీనం చేసుకున్నారు. దానిలో అమృత్ పాల్ దుస్తులు, కొన్ని ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమృత్ పాల్ దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఈ క్రమంలో అతని ప్రయత్నాలను అడ్డుకొనేందుకు సరిహద్దుల్లో బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. నేపాల్, పాకిస్థాన్ లకు ఆనుకొని ఉన్న భారత సరిహద్దుల్లో నిఘాను పెంచారని వార్తలు వస్తున్నాయి.
