AAP Punjab: లోన్ కట్టని రైతులపై అరెస్ట్ వారంట్ జారీచేసిన పంజాబ్ ఆప్ సర్కార్: అంతలోనే దిద్దుబాటు చర్యలు
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని రైతులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులు రాష్ట్రంలో కలకలం రేపింది.
- Bharath Reddy
- Published On : April 24, 2022 / 12:04 PM IST
Punjab
AAP Punjab: ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే విమర్శల్లో చిక్కుకుంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని రైతులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులు రాష్ట్రంలో కలకలం రేపింది. రైతులను అరెస్ట్ చేయాలంటూ వచ్చిన ఉత్తర్వులు ఆమ్ ఆద్మీ పార్టీ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేసింది. దీంతో ఈ వ్యవహారంపై దిద్దుబాటు చర్యలకు దిగింది ఆప్ ప్రభుత్వం. పంజాబ్ రాష్ట్ర ఆప్ ప్రధాన కార్యదర్శి..మల్విందర్ సింగ్ కాంగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..రైతుల అరెస్ట్ వారెంట్ పై విసరణ ఇచ్చారు. ఫిరోజ్ పూర్ జిల్లాలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని రైతులను అరెస్ట్ చేయాలంటూ వచ్చిన వారెంట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెలువడ్డాయని, అదే ఉత్తర్వులను సంబంధిత శాఖ అధికారులు మళ్లీ జారీ చేశారని మల్విందర్ సింగ్ వెల్లడించారు.
Also read:Corona in India: దేశంలో 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు: వరుసగా ఐదో రోజు రెండు వేలకు పైగా కేసులు
ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే తాము ఆ అరెస్ట్ వారెంట్లను వెంటనే ఉపసంహరించుకున్నామని, సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తమ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు ఆప్ సర్కార్ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని మల్విందర్ సింగ్ ఆరోపించారు. ఆమేరకు రైతుల అరెస్ట్ పై గత డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన అరెస్ట్ వారంట్ కాపీలను మల్విందర్ సింగ్ మీడియా ఎదుట ప్రదర్శించారు. రైతులపై ఎలాంటి సమన్లు, వారెంట్లు జారీ చేయవద్దని సీఎం భగవంత్ మాన్ అధికారులను ఆదేశించారని, రైతులను అప్పుల బాధ నుంచి బయటపడేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోందని మల్విందర్ సింగ్ కాంగ్ తెలిపారు.
Also read:PM Modi in JandK: ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన
