బ్లాక్ ఫంగస్ పై కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక సూచనలు

ఇప్పటికే క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడుతున్న వేళ తాజాగా దేశంలో వెలుగుచూసిన బ్లాక్ ఫంగ‌స్‌ గా పిలువబడే మ్యుక‌ర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి ప్రజలను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.

Black Fungus

Black Fungus ఇప్పటికే క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడుతున్న వేళ తాజాగా దేశంలో వెలుగుచూసిన బ్లాక్ ఫంగ‌స్‌ గా పిలువబడే మ్యుక‌ర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి ప్రజలను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వెలుగుచూస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది. కొవిడ్ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్లను మోతాదు మించి వాడిన వారిలో, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదో ముప్పుగా పరిణమించింది.

మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లో ఈ బ్లాక్ ఫంగ‌స్‌ కనిపించిన విషయం తెలిసిందే. తమ దగ్గర ఇప్పటివరకు రెండు వేలకు పైగా కేసులు ఉండొచ్చని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు. అయితే మొన్న‌టి వ‌ర‌కు ఉత్త‌ర భార‌త‌దేశానికి పరిమిత‌మైన ఈ వ్యాధి తాజాగా తెలంగాణ‌లో కూడా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో అంద‌రిలో క‌ల‌వ‌రం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ప్రజలు దానిని ముందుగా గుర్తించి, అప్రమత్తంగా ఉండే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్‌లో పలు సూచనలు చేసింది.

ఇటీవ‌లి కాలంలో ఈ వ్యాధిని కొంత మంది కోవిడ్ రోగుల్లో గుర్తించామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. మొద‌ట్లోనే రోగ నిర్ధార‌ణతో ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుక‌ట్ట‌వేయ‌వ‌చ్చ‌ని ఆయన సూచించారు. ఈ వ్యాధి అంత‌కు ముందు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఎక్కువ‌గా ప్రభావితం చేస్తుందని చెప్పిన మంత్రి.. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్నారు.

మ్యుక‌ర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి?
మ్యుక‌ర్‌మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా వైద్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి సోకి వారిలో పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఎవరికి సోకే అవ‌కాశం ఉంది

చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోంది.
కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు.
ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది వెలుగుచూస్తోంది.

ల‌క్ష‌ణాలు

కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని కేంద్రమంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు వెల్లడించారు.