Asaduddin Owaisi: ఢిల్లీ పోలీసులపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
ఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.
- Narender Thiru
- Updated on- April 21, 2022 / 02:25 PM IST
Asaduddin Owaisi
Owaisi: ఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. ఘర్షణల సందర్భంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఒవైసీ విమర్శించారు. సోమవారం ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. ‘‘సీ-బ్లాక్, జహంగిర్పురిలో యాత్ర చేసేందుకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పారు. అనుమతి లేకుండా యాత్ర చేసేందుకు ఎలా అంగీకరించారు. పిస్టల్స్, కత్తులు ప్రదర్శిస్తూ, రెచ్చగొట్టే నినాదాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. కాషాయ జెండాలను ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారు’’ అంటూ ఒవైసీ ప్రశ్నించారు.
అయితే, యాత్ర సందర్భంగా ఒక మసీదుపై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారనే వార్తలను ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్తానా ఖండించారు. అలాంటి ప్రయత్నమేదీ జరగలేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కాగా, జహంగిర్పురి ఘర్షణలకు కారణమని భావిస్తున్న23 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బాలలు కూడా ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రచారమవుతున్న వార్తలను నమ్మొద్దని ఢిల్లీ పోలీసులు ప్రజలను కోరారు.
