15000 Collected Bank Cheques For Ram Temple Donation Bounce
15000 Collected Bank Cheques for Ram Temple Donation Bounce : అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రామ మందిర విరాళాలకు సంబంధించి వచ్చిన వేలాది చెక్కులు బౌన్స్ అయ్యాయి. రామమందిర ట్రస్టు ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలను సేకరించిన సంగతి తెలిసిందే. భక్తులు ఎవరికి తోచిన విరాళాలను వారు ట్రస్టుకు అందజేస్తున్నారు. చెక్కుల రూపంలో ఇప్పుటికే కోట్లాది విరాళాలు వచ్చాయి. అలా వచ్చిన చెక్కుల్లో దాదాపు 15వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేసిన ఆడిట్ రిపోర్ట్ తెలిపింది. దాదాపు 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆడిట్ లో తేలింది. అలా బౌన్స్ అయిన చెక్కుల విలువ రూ.22 కోట్ల వరకు ఉంది.
ఇది టెక్నికల్ సమస్యల వల్ల వచ్చి ఉంటుందని ట్రస్ట్ భావిస్తోంది. బ్యాంకులలో నగదు లేకపోవడం వల్లా..లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లగానీ చెక్కులు బౌన్స్ అయి ఉండొచ్చని ఆడిట్ నివేదికలో ట్రస్ట్ పేర్కొంది. భక్తులు పంపించిన చెక్కులకు సంబంధించిన ఆయా బ్యాంకులు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నాయని..దీంతో ప్రజలు వీలైతే మళ్లీ తమ విరాళాలు సమర్పించవచ్చని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా కోరారు.
కాగా..బౌన్స్ అయిన చెక్కుల్లో 2 వేలకు పైగా చెక్కులు అయోధ్య నుంచి అంటే లోకల్ ఏరియాల నుంచి సేకరించినవే కావడం గమనించాల్సిన విషయం. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు విశ్వహిందూ పరిషత్ సభ్యులు అయోధ్యతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో విరాళాలను సేకరణ చేశారు. అలా రామజన్మభూమిలో రామాలయం నిర్మించటానికి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ నిర్వహించారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో దాదాపు రూ.5 వేల కోట్ల విరాళాలు వచ్చాయి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వీహెచ్పీ విస్తృతంగా విరాళాలు సేకరించింది.ఈ సందర్భంగా దాదాపు రూ.5 వేల కోట్లు సమకూరగా ట్రస్ట్ ఇంకా అధికారంగా వెల్లడించాల్సి ఉంది.