Bengaluru Family Killed Case : దారుణం.. కన్న తల్లిదండ్రులు, చెల్లిని చంపేసిన ఐటీ ఉద్యోగిని.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
Bengaluru Family Killed AI Chatbot : బెంగళూరులో పరిధిలోని సీగేహళ్లి అపార్టుమెంటులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Harish Thanniru
- Published on- July 23, 2026 / 08:39 AM IST
Bengaluru Family Killed Case
Bengaluru Family Killed AI Chatbot : బెంగళూరులో పరిధిలోని సీగేహళ్లి అపార్టుమెంటులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొంత కుమార్తె తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతోపాటు తన చెల్లిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం సెల్ఫోన్లోని ఏఐ చాట్బాట్ సూచనలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని సీగేహళ్లి అపార్ట్మెంట్లో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), చిన్న కుమార్తె సుప్రియ (19) హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో సోమసుందర్ పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్యలకు వారిద్దరే పాల్పడినట్లు గుర్తించారు. కుటుంబ విభేదాలు, సహజీవన సంబంధంపై అభ్యంతరాలు, అలాగే ఆర్థిక సమస్యలు ఈ ఘటనకు కారణాలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శ్వేత తన తల్లి నుంచి తీసుకున్న సుమారు రూ.50 లక్షల రుణం, దానిపై ఏర్పడిన వివాదం కూడా ఈ కేసులో కీలక కోణంగా పోలీసులు విచారిస్తున్నారు.
హత్యలకు పాల్పడే ముందు నిందితులు కృత్రిమ మేధ (AI) చాట్బాట్ను ఉపయోగించి వివిధ ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఏఐ ఇచ్చిన సమాచారం మాత్రమే నేరానికి కారణమని కాకుండా, నిందితుల ప్రణాళిక, ఉద్దేశం, ఇతర డిజిటల్ ఆధారాలన్నింటినీ పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
హత్యలకు ముందు సుమారు ఆరు నెలల పాటు శ్వేత, కెన్నెత్ కలిసి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వారు ఏఐ చాట్బాట్ను ఉపయోగించి పలు ప్రశ్నలు అడిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఏఐ టూల్ను ఎలా ఉపయోగించారనే విషయంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత ఏఐ సంస్థకు దర్యాప్తు అధికారులు లేఖ రాశారు.
శ్వేత ఐటీ కంపెనీలో పనిచేస్తుండటంతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉందని పోలీసులు తెలిపారు. ఏఐ సేవకు సంబంధించిన చాట్ రికార్డులు, ఇతర డిజిటల్ సమాచారం దర్యాప్తులో కీలక ఆధారాలుగా ఉపయోగపడే అవకాశం ఉందని కేఆర్పురం పోలీసులు వెల్లడించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుల మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, ఆన్లైన్ కార్యకలాపాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో విశ్లేషిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడయ్యే అవకాశం ఉంది.
