Black Fungal Infection: భారత్లో బ్లాక్ ఫంగస్ పంజా.. బెంబేలెత్తిపోతున్న జనం
కరోనాతో ఉక్కిరిబిక్కిరివుతున్న భారత్ను కొత్త భయం వెంటాడుతోంది. ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్ఫంగస్ కొత్త ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
- Sreehari A
- Published On : May 15, 2021 / 08:23 AM IST
Black Fungal Infection
India Black Fungal infection : కరోనాతో ఉక్కిరిబిక్కిరివుతున్న భారత్ను కొత్త భయం వెంటాడుతోంది. ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్ఫంగస్ కొత్త ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొనడంతో కేంద్రప్రభుత్వం దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని షేర్ చేసింది.
సరైన అవగాహన, త్వరగా వ్యాధిని గుర్తించడం ద్వారా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్రం తెలిపింది. ఈ వ్యాధి అంతక ముందు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. అటు బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి ఏమి కాదని… దీనికి చికిత్స కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే సకాలంలో దీన్ని గుర్తించకపోయినా, చికిత్స అందించకపోయినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక కరోనా చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కొంతమంది పేషెంట్లు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బారినపడుతున్నట్లు మెడికల్ పరిశోధనలు చెబుతున్నాయి.
