India : వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, పెరుగుతున్న కేసులు

భారత్‌పై బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 7 వేలు దాటింది. మ్యూకోర్‌మైకోసిస్‌తో 219 మంది చనిపోయారు.

Virus

Black Fungus Cases : భారత్‌పై బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 7 వేలు దాటింది. మ్యూకోర్‌మైకోసిస్‌తో 219 మంది చనిపోయారు. నిన్నమొన్నటి వరకు కరోనా విజృంభించిన మహారాష్ట్ర.. ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అటు గుజరాత్‌లో కూడా దాదాపు అదే పరిస్థతి కనిపిస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతుండటంతో.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాలు బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించాయి.

ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ను ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ప్రకారం నోటిఫయబుల్‌ డిసీజ్‌ వర్గీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. మహారాష్ట్రలో బ్లాక్‌ ఫంగస్‌ ఇప్పటివరకు 15 వందల మందికి సోకగా.. అందులో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 15 వందల మంది బ్లాక్‌ఫంగస్‌ బారిన పడ్డారు. ఇక రాజస్తాన్‌లో బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా ఇప్పటివరకు 400 మంది కంటిచూపు కోల్పోయారు. కేవలం జైపూర్‌లోనే 148 మందికి సోకింది. జోధ్‌పూర్‌లో 100 కేసులు నమోదయ్యాయి.

అటు ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ రోగుల సంఖ్య 300 దాటింది. ఒక్క ఎయిమ్స్‌లోనే వారం రోజుల్లో 80మంది రోగులు చేరారు. వీరిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపుతప్పేలా ఉండడంతో మూడు ఆసుపత్రుల్లో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసింది కేజ్రీవాల్‌ సర్కార్. అటు మధ్యప్రదేశ్‌లో కూడా బ్లాక్‌ఫంగస్‌ విజృంభిస్తోంది. మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా ఇప్పటిదాకా 573 మందికి బ్లాక్‌ఫంగస్‌ సోకింది.

తెలంగాణలో బ్లాక్‌ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కోఠి ENT ఆసుపత్రిని పూర్తిస్థాయిలో బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స అందిస్తోంది ప్రభుత్వం. ENT హాస్పటిల్‌కు మొదట్లో 50 బెడ్లలో మాత్రమే చికిత్సలకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మొత్తం 202 బెడ్లను బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు వినియోగించేందుకు సిద్ధమైంది. ENT ఆసుపత్రిలో 90 మంది బ్లాక్‌ఫంగస్‌ చికిత్స పొందుతుండగా.. మరో 70 మంది వరకు గాంధీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read More :  Mahesh Babu : బీఏ రాజు కన్నుమూత, మహేష్ బాబు భావోద్వేగం..షాక్ తిన్న ఎన్టీఆర్