Nepal Floods : వామ్మో.. నేపాల్ టైప్లో ముంచెత్తే ప్రాంతాలు మనకి కూడా ఉన్నాయా..!
Nepal Floods : నేపాల్లో వరదల గురించి ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. ఈ ముప్పు నేపాల్తో పాటు భారత్కు ఉందని అన్నారు. హిమాలయాల్లో ఏది కరిగినా.. అది సముద్రంలో మట్టాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. హిమాలయాల పర్యావరణ సున్నితత్వం వల్ల నేపాల్, భారత్లు ఎదుర్కొంటున్న ఉమ్మడి ముప్పుగా ఆయన వివరించారు.
- Harish Thanniru
- Published on- August 27, 2026 / 07:39 PM IST
Nepal Floods
Nepal Floods : నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని నింపాయి. ఈ వరదల కారణంగా మృతుల సంఖ్య 300కు చేరింది. అయితే, నేపాల్, టిబెట్లలో కలిపి 1600 మందికిపైగా గల్లంతయినట్లు సమాచారం. వీరిలో 500 మందికిపైగా విదేశీయులు ఉన్నారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. బాధితుల్లో చాలా మంది ట్రెక్కింగ్, కైలాస మానస సరోవర యాత్ర కోసం వచ్చిన వారేనని తెలిపింది. ఈ ఆకస్మిక వరదల కారణంగా 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
Also Read : Nepal Floods : మరో జలప్రళయం దూసుకొస్తోంది.. నేపాల్ను హెచ్చరించిన చైనా..
నేపాల్లో ఆకస్మిక వరదలు భారతీయులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి విపత్తులు భారత దేశంలోని హిమాలయ ప్రాంతాల్లోనూ సంభవించే అవకాశం ఉందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. హిమనదాలు, మంచు సరస్సులు, నిటారైన పర్వతాలు, నదీ లోయలు ఉన్న ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్, గ్లేషియల్ లేక్ ఔట్బస్ట్ ఫ్లడ్స్, కొండచరియలు, అవలాంచ్లు వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. తాజాగా నేపాల్ విపత్తు కూడా హిమాలయ పర్యావరణ వ్యవస్థలో పెరుగుతున్న ప్రమాదాలను మరోసారి స్పష్టం చేసింది.
నేపాల్ తరహాలో వరదలు సంభవించే ప్రమాదం భారత దేశంలోని కొన్ని ప్రాంతాలకు పొంచిఉంది. దేశంలోని హిమాలయ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో జమ్మూకశ్మీర్, లద్దాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, లద్దాక్ ప్రాంతాలు హైరిస్క్ జోన్లో ఉన్నాయి. లద్దాక్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో గుర్తించిన కొన్ని హిమనద సరస్సులు అత్యధిక ప్రమాద కేటగిరీలో ఉన్నట్లు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఎత్తైన పర్వత ప్రాంతాలు, హిమనదాలు, మంచు సరస్సులు, నిటారైన లోయలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లాహౌల్ స్పితి, కిన్నౌర్, కులు, చంబా జిల్లాలకు నేపాల్ తరహా వరద ముప్పు పొంచి ఉంటుంది. ఈ జిల్లాల్లో హిమనదాలు, మంచు సరస్సులు, కొండచరియలు, నదీ లోయలు ఉండటంతో ప్లాష్ ప్లడ్స్ లకు అవకాశం ఉంటుంది. ఇటీవల అధ్యయనాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్లేషియల్ సరస్సుల సంఖ్య గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్లు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, హిమనదాలు వేగంగా కరుగుతుండటం వల్ల ఈ సరస్సుల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంతాలకు ప్రమాదం పెరుగుతోంది. అదేవిధంగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ, జోషిమఠ్, గర్వాల్ ప్రాంతాలకు నేపాల్ తరహాలో ఆకస్మిక వరదల ప్రభావం ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ ప్రాంతాలు హిమాలయ విపత్తులకు అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా ఉన్నాయి. 2021లో చమోలీ జిల్లాలో జరిగిన భారీ ఫ్లాష్ ఫ్లడ్లో మంచు, రాళ్లు, నీరు, మట్టి భారీగా దిగువకు దూసుకురావడంతో జలవిద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇదిలాఉంటే.. నేపాల్లో వరదల గురించి ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. ఈ ముప్పు నేపాల్తో పాటు భారత్కు ఉందని అన్నారు. హిమాలయాల్లో ఏది కరిగినా.. అది సముద్రంలో మట్టాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. హిమాలయాల పర్యావరణ సున్నితత్వం వల్ల నేపాల్, భారత్లు ఎదుర్కొంటున్న ఉమ్మడి ముప్పును ఆయన వివరించారు.
