Arvind Kejriwal, Chandrababu Naidu
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని “హాఫ్ ఇంజన్ సర్కార్” అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
యమునా అత్యంత కలుషితమైన నది అని చంద్రబాబు నాయుడు అన్నారు. పదేళ్లలో ఆమ్ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించలేకపోయిందని చెప్పారు. ఢిల్లీలో అభివృద్ధి పనులు చేయాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం.. పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు నియామకం..
ఢిల్లీ, పంజాబ్లో ఆప్ అధికారంలో ఉందని, ఆప్ది మొత్తం వైఫల్యం చెందిన మోడల్ అని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో డ్రైనేజీ నీటికి, తాగునీటికి మధ్య తేడా లేదని విమర్శించారు. నీటి నాణ్యత బాగోలేదని చెప్పారు.
ఢిల్లీలో ఆప్ సర్కారు పాలనలో జరిగిన అవినీతి గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇతర కుంభకోణాలతో పోల్చి చూస్తే.. మద్యం కుంభకోణం మరింత నీచమని చెప్పారు. ఇటువంటి ఆప్ మోడల్ దేశానికి మంచిది కాదని అన్నారు.
సంపదను సృష్టించిన నాయకుడే, సంపదను పంచడం గురించి మాట్లాడాలని చంద్రబాబు నాయుడు అన్నారు. సరైన పార్టీని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఢిల్లీ రెండు రకాల కాలుష్యాలతో బాధపడుతోందని, ఒకటి వాయు కాలుష్యమైతే, రెండోది రాజకీయ కాలుష్యమని చెప్పారు. ఈ రెండింటినీ తప్పించాలని తెలిపారు.