Pangong Lake : సరిహద్దుల్లో చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. భారత సరిహద్దుకు తన సైన్యాన్ని వేగంగా తరలించేందుకు వీలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఓ వంతెనను చైనా నిర్మిస్తోంది. జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన శాటిలైట్ ఫొటోలు ఈ విషయాన్ని సృష్టం చేస్తున్నారు.
చైనా ఆధీనంలోని ఖురాంక్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. అత్యంత ఇరుకుగా ఉండే ఈ ప్రాంతంలో రెడిమేడ్ నిర్మాణ సామగ్రితో చైనా పనులు కొనసాగిస్తోంది. బ్రిడ్జ్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు తెలియజేస్తున్నాయి.
2020లో లఢఖ్లోని కైలాస్ రేంజ్ను భారత్ ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు చైనా ఆధీనంలో ఉన్న కైలాశ్ రేంజిపై భారత్ మెరుపు ఆపరేష్ చేపట్టాక చైనా సైన్యం సత్వరమే స్పందించి ప్రతిఘటించ లేకపోయింది. చైనా దళాలు అక్కడకు చేరుకోవడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. అప్పటి నుంచి పాంగాంగ్ సరస్సు దగ్గర భారత్ దూకుడు పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేని డ్రాగన్ మరోసారి అలాంటివి జరగకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే సైనికులు, భారీ ఆయుధాలను తరలించేందుకు వీలుగా పాంగాంగ్ సరస్సు రెండు వైపులను కలుపుతూ వంతెన నిర్మాణం చేపట్టింది.
ఈ వంతెన పూర్తయితే.. చైనా సైనికులు 180 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది. ఖురాంక్ నుంచి రుడాంక్కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి చేరుకోవచ్చు. దాదాపు 130 కిలోమీటర్లు పొడవున్న పాంగాంగ్ సరస్సులో కొంత భాగం టిబెట్లో ఉండగా.. మరికొంత భాగం లఢఖ్ ప్రాంతంలో ఉంది. ఈ వంతెన సహా కైలాస్ రేంజ్ వద్ద భారత సైనికుల ఆపరేషన్లను అడ్డుకునేందుకు వివిధ రకాల ఇతర రహదారులను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది.
మరోవైపు 2020 జూన్లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన గల్వాన్ లోయలో చైనా సైన్యం కొత్త సంవత్సరం సందర్భంగా తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. గల్వాన్ లోయలో చైనా పతాకావిష్కరణపై భారత సైన్యం వివరణ ఇచ్చింది. చైనా పతాకం వివాద రహిత ప్రాంతంలోనే ఎగిరిందని తెలిపారు. 2020 జూన్లో ఘర్షణలు జరిగిన ప్రాంతం దగ్గర కాదని స్పష్టం చేసింది.
ALSO READ Satyapal Malik : మోదీని షా అంత మాట అన్నారా! మేఘాలయ గవర్నర్ వివరణ