climate update: ఇవేం ఎండలు రా బాబూ.. మే నెల ముగిసినా ఎండలు తగ్గవట!
ఎండలు మంటపుట్టిస్తున్నాయా? ఇవేం ఎండలు రా బాబూ అనుకుంటున్నారా? మే నెల ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారా? మే ముగిసినా ఎండలు తగ్గవట.
- Naga Srinivasa Rao Poduri
- Published On : May 20, 2023 / 03:51 PM IST
climate update – WMO : ఎండ ప్రచండం. భానుడి భగభగలతో మంటపుడుతోంది. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో వాతావరణం నిప్పుల కొలిమిగా మారుతోంది. ముందన్నెడూ లేనంతలా ఈ వేసవిలో ప్రతాపం చూపుతున్నాడు సూర్యుడు. ఈ ఎండ మంట (Hot Summer) ఇప్పుడే కాదు.. మరో ఐదేళ్లు ఇలానే ఉంటుందని హెచ్చరిస్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ. గ్లోబల్ వార్మింగ్ (Global Warming) పెరిగిపోతుండటంతో ఇప్పటికే భూమి వేడెక్కిపోగా.. వచ్చే ఐదేళ్లు మరింత దారుణంగా ఉంటుందని డేంజర్బెల్ మోగించింది ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization).
డేంజర్ బెల్ మోగించిన ప్రపంచ వాతావరణ సంస్థ
ఎండలు మంటపుట్టిస్తున్నాయా? ఇవేం ఎండలు రా బాబూ అనుకుంటున్నారా? మే నెల ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారా? మే ముగిసినా ఎండలు తగ్గవట. ఇప్పుడే కాదు వచ్చే ఐదేళ్లు ఇదే పరిస్థితి అని హెచ్చరిస్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ. కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో భూతాపం పెరిగిపోతోందని.. దీనికి ఎల్నినో తోడవడంతో వచ్చే ఐదేళ్లు ఎండలు మరింత తీవ్రంగా కాస్తాయని తన నివేదికలో హెచ్చరించింది ప్రపంచ వాతావరణ సంస్థ – WMO. ఇప్పటికే వేసవి ఎండలతో జనం అవస్థలు పడుతున్నారు. సాధారణం కన్నా అత్యధికంగా ఎండలు కాస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా 40 డిగ్రీలకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు. ఏపీలో అయితే కొన్నిచోట్ల 48 డిగ్రీల మేర ఎండ కాస్తోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేనట్లు సుర్రుమనిపిస్తున్నాడు సూర్యుడు. ఇప్పుడు WMO హెచ్చరికలతో జనం మరింత భయపడుతున్నారు.
వచ్చే ఐదేళ్లు భానుడి భగభగలు
WMO నివేదిక ప్రకారం వచ్చే ఐదేళ్లు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పారిశ్రామక విప్లవం నాటి రోజులతో పోల్చుకుంటే.. అంటే 1850-1900 మధ్య కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరిగిపోయాయి. భూతాపం పెరిగిపోయి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అకాల వర్షాలు, కరువు, వరదలు, హిమపాతంతో ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు కర్బన ఉద్గారాలు తగ్గించి భూమి వేడెక్కకుండా చూడాలని 2015లో పారిస్లో జరిగిన కాప్ దేశాల సదస్సులో తీర్మానించుకున్నాయి ప్రపంచ దేశాలు. ఈ ఒప్పందం ప్రకారం 1.5 డిగ్రీలకన్నా తక్కువకు వేడి తగ్గించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు ఆ లక్ష్యాన్ని చేరలేకపోయారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రపంచ దేశాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఏటా భూ ఉపరితల ఉష్ణోగ్రతల్లో ఎంతో మార్పు వస్తోంది. కాలంతో సంబంధం లేకుండా సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు.
గ్లోబల్ వార్మింగ్తో మరింత తీవ్రంగా ఎండలు
కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలను అనుభవిస్తోంది ప్రపంచం. లానినో ప్రభావంతో కొంతమేర వర్షాలు కురిసి తాత్కాలిక ఉపశమనం దక్కింది. లానినో స్థానంలో ఇప్పుడు ఎల్నినో వస్తుందని హెచ్చరిస్తుంది WMO. భూతాపానికి తోడు ఎల్నినో జతకలవడంతో ఎండలు సుర్రుమనిపించడం ఖాయం అంటున్నారు. కాలంతో సంబంధం లేకుండా ఎండలు తీవ్రంగా కాస్తాయని చెబుతోంది ప్రపంచ వాతావరణ సంస్థ. ఇది కరువు పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కాలంతో సంబంధం లేకుండా ఎండలు పెరిగిపోతాయని.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుందని WMO నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: వడదెబ్బతో 19 మంది మృతి.. తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు..
ఈ ఏడాది మే నుంచి జూలై వరకు ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 60 శాతం ఉన్నందున, గ్లోబల్ ఉష్ణోగ్రతలు 2024లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్కిటిక్ ఖండంలో ఉష్ణోగ్రత క్రమరాహిత్యం ఎక్కువగా కనిపిస్తోంది. అసమాన రీతిలో ఆర్కిటిక్ వేడెక్కడంతో డేంజర్బెల్ మోగినట్లేనని అంటున్నారు పరిశీలకులు. 1991 నుంచి 2020 మధ్య సగటు వర్షపాతంతో పోలిస్తే, 2023 నుంచి 2027 సగటు వర్షపాతం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. WMO చెప్పేది చెప్పినట్లు జరిగితే వచ్చే ఐదేళ్లు మనం ఎండ వేడితోపాటు కరువును అనుభవించాల్సివస్తుంది.
Also Read: క్రూరంగా హింసించి ప్రాణాలు తీశారు.. రాధ పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు..
