Adhir Ranjan To Murmu As 'rashtrapatni'..bjp Demands Apology
president Draupadi murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’అంటూ కాంగ్రెస్ అవమానించింది అంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంట్లో భాగంగానే పార్లమెంట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో మహిళా ఎంపీలంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’అంటూ అవమానించారు అంటూ బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ తక్షణం క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తూ లోక్ సభ కార్యకలాపాలను స్థంభింపజేశారు.
ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ లోకసభ పక్ష నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి పీఠం ఎక్కడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందనంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే దేశ ప్రజలందరినీ అవమానించడమేనని అన్నారు.
అధీర్ రంజన్ వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాలలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. అధీర్ రంజన్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న గిరిజనుల గుర్తింపుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ద్రౌపది ముర్మును అవమానించడం కాంగ్రెస్ పార్టీ నాయకుల సంస్కృతికి అద్దం పడడమే కాకుండా ద్వేషాన్ని ప్రదర్శించడమేనని పలువురు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపత్ని అంటూ రాష్ట్రపతిపై అధీర్ రంజన్ అనుచిత వ్యాఖ్యలు.. పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.