నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఈ అనుభవం ఎదురైంది.. ఆసక్తికర ఘటన గురించి చెప్పిన ప్రియాంకా గాంధీ
కొన్ని రోజుల క్రితం తాను యూడీఎఫ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఓ వ్యక్తి తన కారును ఆపారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : October 28, 2024 / 03:59 PM IST
Priyanka Gandhi
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ వయనాడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆసక్తికర విషయం చెప్పారు. తాను ఇటీవల నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఓ సంఘటన ఎదురైందని అన్నారు. వయనాడ్లో తనకు ఓ తల్లి ఉన్న అనుభవాన్ని ఆ సంఘటన ఇచ్చిందని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం తాను యూడీఎఫ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఓ వ్యక్తి తన కారును ఆపారని అన్నారు. అతని తల్లి తనను కలవాలని అనుకుంటోందని చెప్పారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని చెప్పారని అన్నారు. దీంతో తాను ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అతని తల్లితో మాట్లాడానని, తనను చూడగానే ఆమె తన బిడ్డలాగా కౌగిలించుకుందని తెలిపారు.
దీంతో వాయనాడ్లో తనకు ఇప్పటికే ఒక తల్లి ఉన్నట్లు అనిపించిందని ప్రియాంకా గాంధీ చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని, ఆ సమయంలో సమాజం మొత్తం ఇక్కడకు వచ్చి బాధితులకు ఎలా సాయపడిందో చూశానని ప్రియాంకా గాంధీ తెలిపారు.
అందరూ పరస్పరం సాయం చేసుకున్నారని ప్రియాంకా గాంధీ చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యల నుంచి మొదలు పెడితే పంటల ఎమ్మెస్పీ, పర్యాటక పరిశ్రమ, నిరుద్యోగం అనేక సమస్యలు ఎలా ఉన్నాయో ప్రియాంకా గాంధీ వివరించారు. తన బాధ్యత ఏమిటో తనకు అర్థమైందని చెప్పారు.
