ఇచ్చిన హామీలు అన్నీ ఏమయ్యాయి?: హరీశ్ రావు ఫైర్
హామీల గురించి అడిగితే నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని హరీశ్ రావు చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇవాళ హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలో 11 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడన అందుతోందని తెలుస్తోందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపం బట్టబయలైందని, ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయని అన్నారు. నోటికి వచ్చినట్లు మాత్రమే మాట్లాడడమే సీఎంకు తెలుసని, హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
హామీల గురించి అడిగితే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీశ్ రావు చెప్పారు. హామీలు మాత్రమే కాకుండా, కేసీఆర్ గతంలో మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలను కూడా అమలు చేయడం లేదని తెలిపారు. బతుకమ్మ చీరెలు, రైతు బంధు, రుణమాఫీ లేవని చెప్పారు.
పంటలు కొనే దిక్కు లేదని, పత్తి ఎక్కడైనా కొనుగోలు చేశారా అని హరీశ్ రావు నిలదీశారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లో రైతులు రోడ్డెక్కారని, తక్కువ ధరకు వరి అమ్ముకునే పరిస్థితి వచ్చిందగని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులను మోసం చేశారని చెప్పారు. నిరుద్యోగుల ఇచ్చిన హామీ ఏమైందని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు అని మోసం చేశారని తెలిపారు.