అనారోగ్యకారణాలతో మరణించిన మహిళకు కరోనా వ్యాధి ఉందనే అనుమానంతో పోలీసులు, డాక్టర్లుపై స్ధానికులు దాడి చేసిన ఘటన హరియానాలోని అంబాలాలో జరిగింది. సోమవారం సాయంత్రం ఏప్రిల్ 27 న అనారోగ్య కారణాలతో ఒక మహిళ(60) కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె శవాన్ని దహానం చేయటానికి డాక్టర్లు, పోలీసులు శ్మశాన వాటికకు చేరుకున్నారు.
ఆ మహిళకు కరోనా వ్యాధి సోకిందనే అనుమానంతో శవాన్ని ఆ ప్రాంతంలో దహనం చేయటానికిస్ధానికులు ఒప్పుకోలేదు. సుమారు 400 మంది ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై రాళ్ళతో దాడి చేశారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత శవాన్ని ఖననం చేశారు.
ఆస్థమాతో బాధపడుతున్న మహిళ.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. మహిళకు సంబంధించిన కోవిడ్ నిర్ధారణ రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. కరోనాతో చనిపోయినా.. వైరస్ అనుమానితులుగా చనిపోయినా మృతదేహాన్ని దహనం చేసేందుకు పూర్తి రక్షణాత్మక పద్ధతులు పాటిస్తామని వెల్లడించారు. గ్రామస్తులు అనవసరంగా అంత్యక్రియలను అడ్డుకున్నారని తెలిపారు.
స్థానికులకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదని అంబాల డీఎస్పీ రామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడిలో ఒక అంబులెన్స్ కూడా ధ్వంసమైందన్నారు. లాక్డౌన్ పాటించకుండా.. తమ విధులను అడ్డుకున్నవారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 289 కరోనా పాజిటివ్ కేసలు నమోదవగా.. ముగ్గురు మరణించారు. అంబాల పట్టణంలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.