Covaxin Doses : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భారత్ సహా ఇతర దేశాల్లో వ్యాపిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ అప్ఘానిస్తాన్కు సాయం అందించింది. అప్ఘాన్కు శనివారం భారత్.. స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ (COVAXIN) 5 లక్షల టీకా డోసులను పంపింది. కాబూల్లోని ఇందిరా గాంధీ పిల్లల ఆస్పత్రికి ఈ కొవాగ్జిన్ టీకాలను అప్పగించింది.
ఒకవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. భారత్ మానవతా దృక్పథంతో తన వంతు సహకారం అందించింది. కొవాగ్జిన్ డోసులను ఇందిరాగాంధీ ఆసుపత్రికి అప్పగించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాలిబన్ల ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. దీనికి తోడు కరోనా తోడు కావడంతో అప్ఘాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ ఆపన్న హస్తాన్ని అందించింది. రాబోయే వారాల్లో మరో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గత నెల ప్రారంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా భారత్ అప్ఘానిస్తాన్కు 1.6 టన్నులతో కూడిన వైద్య సదుపాయాలను అందించింది.
రాబోయే వారాల్లో.. గోధుమ సరఫరాతో పాటు మిగిలిన వైద్య సదుపాయాలను అందించనున్నట్టు వెల్లడించింది. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి UN ఏజెన్సీలు, ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నామని MEA పేర్కొంది.
Read Also : Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్ లక్షణం కావొచ్చు..!