Covid Vaccination : నేటి నుంచే 15-18 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్.. స్పెషల్ సెంటర్ల ఏర్పాట్లు!
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దలతో పాటు పిల్లలకు కూడా రక్షణ కల్పించే దిశగా భారత్ సర్కారు చర్యలు చేపట్టింది.
- Sreehari A
- Published On : January 3, 2022 / 08:01 AM IST
Covid Vaccination For Children To Be Started From Today
Covid Vaccination : కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దలతో పాటు పిల్లలకు కూడా రక్షణ కల్పించే దిశగా భారత్ సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే.. పిల్లలకు సైతం కొవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు సోమవారం (జనవరి 3) నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం నుంచి ఆయా కేంద్రాల్లో పిల్లలకు టీకాల పంపిణీ ప్రారంభం అవుతుంది. కొవిన్ పోర్టల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పేర్లు నమోదు అయ్యాయి. 15ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాష్ట్రాలు పిల్లల కోసం ప్రత్యేక వాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 15-18 ఏళ్ల పిల్లల కోసం 159 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కోవాగ్జిన్ టీకాకు అర్హులైన టీనేజర్లకు వైద్య సిబ్బంది టీకాలను అందించనున్నారు. ఇప్పటికే కోవిన్ పోర్టల్ లో 6 లక్షలకు పైగా పిల్లలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. కొవిన్ పోర్టల్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్న పిల్లలకే ముందుగా వ్యాక్సిన్లు అందనున్నాయి. ఆదివారం రాత్రికి రిజిస్ట్రేషన్ల సంఖ్య 6 లక్షలు దాటేశాయి. సాయంత్రం వరకు 6లక్షల 35వేల మంది యుక్త వయసు పిల్లలు వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్ పేర్లు నమోదు చేయించుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రెడీగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లపై రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, చీఫ్ సెక్రటరీలతో మాండవీయ సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చిన్నారుల కొవాగ్జిన్ టీకానే సోమవారం నుంచి పిల్లలకు అందించనున్నారు. ఇదివరకే డీసీజీఐ పిల్లల్లో టీకాకు అనుమతులు జారీ చేసింది. టీకాలు పొందే 15 నుంచి 18 ఏళ్ల లోపు వారంతా కొవిన్ పోర్టల్లో తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకే వెళ్లి వాక్ ఇన్ రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు.
Read Also : Corona in Cruise: క్రూయిజ్ షిప్ లో ఒకరికి కరోనా పాజిటివ్, ఓడ నిలిపివేత
