Road Tax on Cycle: సైకిల్ పై రూ.1.51 లక్షల రోడ్డు ట్యాక్స్: బిత్తరపోయిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తికి మాత్రం సైకిల్ పై రోడ్ టాక్స్ కట్టాలంటూ రూ. లక్షన్నర బిల్లు పంపించారు అక్కడి ఆర్టీఓ అధికారులు
- Bharath Reddy
- Updated on- December 29, 2021 / 04:08 PM IST
Cycle
Road Tax on Cycle: వాహనాలకు రోడ్ టాక్స్ వేయడం సర్వసాధారణం. వాహనాల కేటగిరీని బట్టి వాటిపై టాక్స్ విధిస్తారు రవాణాశాఖ అధికారులు. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తికి మాత్రం సైకిల్ పై రోడ్ టాక్స్ కట్టాలంటూ రూ. లక్షన్నర బిల్లు పంపించారు అక్కడి ఆర్టీఓ అధికారులు. వివరాల్లోకి వెళితే ఔరయ్యా నగరం పరిధి, దిబియాపూర్ మున్సిపాలిటీలోని సెహుద్ ప్రాంతంలో నివాసముంటున్న సురేష్ చంద్ర అనే వ్యక్తికి ఇటీవల దిబియాపూర్ ఏఆర్టీఓ అధికారి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. తనకున్న “కమర్షియల్ వాహనంపై జూన్ 2014 నుంచి సెప్టెంబర్ 2021 వరకు రూ.1.51 లక్షల రోడ్ టాక్స్ పెండింగ్ లో ఉందని, వెంటనే ఆమొత్తాన్ని చెల్లించాలని” ఆ ఉత్తర సారాంశం. సుధీర్ చంద్ర అనే పేరుపై ఈ ఉత్తరం వచ్చింది. తన కుమారుడైన సుధీర్ పై వచ్చిన ఆ ఉత్తరం చూసి సురేష్ ఒక్కసారిగా కంగుతిన్నాడు.
Also Read: Cold Wave in Northeast: మంచు దుప్పటి కప్పుకున్న ఈశాన్య రాష్ట్రాలు
ధర్మశాలలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న సురేష్ కు ఉన్న ఏకైక వాహనం సైకిల్!. సురేష్ కుమారుడు సుధీర్ కు కూడా ఎటువంటి వాహనం లేదు. దీంతో విషయాన్నీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు సురేష్. దీనిపై స్పందించిన ఏఆర్టీఓ అశోక్ కుమార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 2021 సెప్టెంబర్ 16న అధికారులు పంపించిన ఆ ఉత్తరం డిసెంబర్ మూడో వారంలో సురేష్ చంద్ర ఇంటికి చేరింది. దీంతో అక్కడి తపాలాశాఖ సేవలు ఏవిధంగా ఉన్నాయో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు
