Firecrackers In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అధికారులతో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా నిర్ణయం ప్రకారం ఆన్లైన్ లేదా ఇతర అన్ని రకాల బాణసంచా విక్రయంపై ఢిల్లీ పరిధిలో నిషేధం అమలులో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం… బాణసంచాను అమ్మినా, కలిగి ఉన్నా, తయారు చేసినా నేరంగానే పరిగణిస్తారు. అన్ని రకాల బాణసంచాపై ఈ నిషేధం అమలులో ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం వల్ల ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జబ్బుల బారిన పడుతున్నారు.
అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు. ప్రజల జీవితాల్ని కాపాడే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు, దీని అమలులో ఢిల్లీ పోలీసులు, కాలుష్య నియంత్రణ అధికారులు, రెవెన్యూ శాఖ పనిచేస్తాయని ఆయన చెప్పారు.