Arvind Kejriwal – Centres Ordinance: ఢిల్లీ (Delhi) సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ను కలిశారు. ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని అన్నారు. ఇందుకు అఖిలేశ్ యాదవ్ అంగీకరించారు.
అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ… ” బీజేపీయేతర పార్టీలన్నీ ఢిల్లీ ఆర్డినెన్సుపై ఒక్కటై రాజ్యసభలో దీన్ని ఓడిస్తే ఓ గట్టి సందేశాన్ని ఇవ్వచ్చు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాదన్న సందేశం వెళ్తుంది. రాజ్యసభలో మాకు మద్దతు ఇస్తామని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు ” అని చెప్పారు.
అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ… ” ఆ ఆర్డినెన్స్ ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఈ విషయంలో పోరాడడానికి సీఎం కేజ్రీవాల్ కు సమాజ్ వాదీ పార్టీ మద్దతుగా ఉంటుంది ” అని చెప్పారు. మరోవైపు, లక్నో సివిల్ కోర్టులో ఇవాళ జరిగిన కాల్పుల గురించి అఖిలేశ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం హయాంలో యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని అన్నారు.
ఎవరిని చంపారన్న విషయం ముఖ్యంకాదని, భారీ భద్రత ఉండే కోర్టు వద్ద ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హమని అన్నారు. కోర్టు ఆవరణలోనే గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవాను దుండగులు కాల్చి చంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
కాగా, ఇటీవల హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పాలనా అధికారాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన పలువురు నేతలను కలుస్తున్నారు.
Gangster Sanjeev Jeeva: యూపీలో మరో దారుణం.. కోర్టు వెలుపలే గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవా హత్య