×
Ad

Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్‌

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 50 మంది, సమర్ధిస్తూ 50 మంది ఎంపీలు సంతకాలు చేయనున్నారు.

  • Published On : June 24, 2022 / 07:44 AM IST

Draupadi

Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఇవాళ ద్రౌపది ముర్ము నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నివాసంలో పేపర్లు సిద్ధమయ్యాయి. నామినేషన్ సందర్భంగా ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. ఇక ఇవాళ నామినేషన్ వేసే సమయంలో ద్రౌపది ముర్ము వెంట ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 50 మంది, సమర్ధిస్తూ 50 మంది ఎంపీలు సంతకాలు చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు.

PM Modi Tweet : ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్

అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కలిశారు. తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని అన్ని వర్గాలు ప్రశంసించాయని ప్రధాని మోదీ అన్నారు. అట్టడుగు సమస్యలపై ఆమెకున్న అవగాహన, అభివృద్ధికి సంబంధించిన విజన్‌ అత్యద్భుతం అని ప్రశంసించారు.

ఇక ద్రౌపది ముర్ముకు పోటీగా ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలోకి దిగనున్నారు. ఈనెల 27న ఉదయం 11.30కు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ నిర్వహించనుండగా.. అదే నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.