కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు 3రోజుల్లో కొత్త రూల్స్
- venkaiahnaidu
- Published On : August 18, 2020 / 07:31 PM IST
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది.
ఈ అంశంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీల నుంచి సూచనలు తీసుకున్నట్టు ఈసీ పేర్కొంది. వివిధ రాజకీయ పార్టీలు అందించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సలహాలను కూడా తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
తాము వెలువరిచే మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని.. స్థానికంగా కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించే బాధ్యత ముఖ్య ఎన్నికల అధికారులదేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ తేదీల్లో బిహార్ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనితో పాటు కరోనా సంక్షోభం, వరదల వల్ల అనేక ఉపఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు ఈసీ ఎలాంటి కొత్త షెడ్యూళ్లను విడుదల చేయలేదు.
