anil ambani
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ (RAAGA కంపెనీలు)కి చెందిన 35కి పైగా ప్రదేశాలు, 50 కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు చేపట్టింది. ఈ దాడులు ఎస్ బ్యాంక్లో లోన్ల విషయంలో మోసాలకు పాల్పడిన కేసుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా జరుగుతున్నాయి.
సెబీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) వంటి సంస్థల నివేదికల ఆధారంగా సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లు నమోదుచేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17 ప్రకారం దర్యాప్తులు కొనసాగుతున్నాయి.
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. 2017 – 2019 మధ్య ఎస్ బ్యాంక్ ఇచ్చిన సుమారు రూ.3,000 కోట్ల విలువైన రుణాలు షెల్ కంపెనీలు, ఇతర గ్రూప్ ఎంటిటీలకు మళ్లించినట్టు ప్రాథమికంగా తేలింది. ఎస్ బ్యాంక్ ప్రమోటర్తో పాటు అధికారులు లంచం తీసుకున్నట్లు ఆధారాలు కూడా దొరికాయి.
ఎస్ బ్యాంక్ రుణ ఆమోద ప్రక్రియలో ఎన్నో లోపాలు ఉన్నట్టు ఏజెన్సీ గుర్తించింది. క్రెడిట్ పత్రాలను బ్యాక్ డేటింగ్ చేయడం, సరైన పరిశీలన లేకుండా రుణాలు మంజూరు చేయడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్న సంస్థలకు రుణాలు ఇవ్వడం వంటి అక్రమాలు జరిగాయి.
రుణ మంజూరుకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడం, ఖాతాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించడం, రుణ ఆమోదానికి ముందు లేదా అదే రోజున డబ్బు విడుదల చేయడం వంటి విషయాలు వెలుగుచూశాయి. 50కి పైగా కంపెనీలు, 25 మంది వ్యక్తులు ఈ దర్యాప్తులో అనుమానితులుగా ఉన్నారు. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL)కి సంబంధించి సెబీ సమర్పించిన నివేదికలో కూడా నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీ కార్పొరేట్ లోన్ బుక్ ఒకే ఏడాదిలో రెట్టింపు కావడం అనుమానాలకు తావిస్తోంది.