Electoral Bond Case : ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రేపటిలోగా వివరాలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
మార్చి 12వ తేదీలోపు దాతల వివరాలను ఈసీకి, సుప్రీంకోర్టు అందజేయాలి. మార్చి 15లోపు ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్ లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు పొందుపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- Harishth Thanniru
- Published On : March 11, 2024 / 01:35 PM IST
Electoral Bond Case
SBI : సుప్రీంకోర్టులో ఎస్బీఐకి చుక్కెదురైంది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న ఎస్బిఐ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. రేపటి (మార్చి12)లోగా ఏప్రిల్ 2019 నుంచి ఉన్న ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎస్బిఐ ఈసీ, సుప్రీంకోర్టుకు వెల్లడించాలని, దాతలు ఎలక్టోరల్ బాండ్ కొన్నతేదీ, కొన్నవారి పేరు, బాండ్ విలువ, ఎలాక్టోరల్ బాండ్ రిడీమ్ చేసుకున్న పార్టీ వివరాలు, రిడీమ్ చేసుకున్న తేదీ వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐను ఆదేశించింది.
Also Read : Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం!
ఎస్బీఐ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యలు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపర్చామని, వాటిని మ్యాచ్ చేసి వివరాలను ఇచ్చేందుకు మరింత సమయం కావాలని బ్యాంకు తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో మాతీర్పు స్పష్టంగా ఉంది. ఏదాత నుంచి ఏ గ్రహీత ఎంత తీసుకున్నారన్న వివరాలను మ్యాచ్ చేసి మేం చెప్పమనలేదు. ఎన్ని బాండ్లను జారీ చేశారన్న వివరాలను ఉన్నది ఉన్నట్లుగా ఈసీకి ఇవ్వమని ఆదేశించాం. మేం ఆదేశించిన సమయం నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ ఎస్బీఐ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
మార్చి 12వ తేదీలోపు దాతల వివరాలను ఈసీకి, సుప్రీంకోర్టు అందజేయాలి. మార్చి 15లోపు ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్ లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు పొందుపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే ధిక్కార కేసును ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టు ఎస్బీఐను హెచ్చరించింది.
Also Read : ఆసక్తికరంగా క్రికెటర్ల పొలిటికల్ ఎంట్రీ.. చర్చనీయాంశంగా యూసుఫ్ పఠాన్ నియోజకవర్గం
