దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 13 మంది మావోల మృతదేహాలు లభ్యం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
- Harishth Thanniru
- Updated on- April 3, 2024 / 11:11 AM IST
Chhattisgarh
Chhattisgarh : లోక్ సభ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం నుండి DRG, CRPF, కోబ్రా బెటాలియన్, బస్తర్ బెటాలియన్ జవాన్లుతో మావోయిస్టులు మధ్య సుదీర్ఘ ఎన్కౌంటర్ జరిగింది.
సుమారు 8 గంటలపాటు ఈ ఎన్ కౌంటర్ కొనసాగింది. అనేక మంది మావోయిస్టులు మరణించారు. మంగళవారం సాయంత్రం వరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కూంబింగ్ అనంతరం మరో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం వరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
Also Read : Massive Earthquake : తైవాన్ను కుదిపేసిన భారీ భూకంపం.. జపాన్ సహా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు
ఎన్ కౌంటర్ ముగిసిన తరువాత భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని జవాన్లు గుర్తించారు. ఎన్ కౌంటర్ లో పోలీసు బలగాలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో గంగలూరు కమిటీ దళానికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
