BJP Government: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కసరత్తు.. జనవరి 14న ముహూర్తం?
మోదీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది జూలై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. కొత్తవారికి మంత్రివర్గంలో చోటు లభించింది.
- Harishth Thanniru
- Published On : December 31, 2022 / 08:07 AM IST
Modi cabinet
BJP Government: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణకు కసరత్తు మొదలు పెట్టిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనవరి 14 తరువాత మంత్రి వర్గంలో పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను తొలగించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. మోదీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది జూలై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో 15 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే, ఒకవైపు బీజేపీలోనూ, మరోవైపు ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులు చేసేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరిగితే 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్దపీటవేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించాల్సిన పరిస్థితి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కొంత మంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చునని బీజేపీలో చర్చ జరుగుతుంది.
PM Modi Cabinet : కేంద్ర కేబినెట్ విస్తరణ, నేతల జాబితా
భారతీయ జనతా పార్టీలోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటాయని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగుస్తుంది. మరోసారి నడ్డాను అధ్యక్ష పదవిలో కొనసాగించినప్పటికీ, పార్టీ పదవుల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తొలుత, మంత్రి వర్గంలో పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని, బడ్జెట్ సెషన్ కంటే ముందే ఈ ప్రక్రియ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ తరువాత పార్టీలో కీలక పదవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని, ఈ ప్రక్రియ అంతా మరికొద్ది నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొనే జరుగుతుందని సమాచారం.
