Lakhimpur Kheri Violence: రైతులపై హత్యాయత్నం.. లఖీంపూర్ ఖేరి నిందితుడికి బెయిల్ మంజూరు
రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుత కేంద్ర మంత్రి, బీజేపీ నేత అజయ్ మిశ్రా తనయుడు.
- Narender Thiru
- Published On : January 25, 2023 / 01:26 PM IST
Lakhimpur Kheri Violence: రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. అశిష్ మిశ్రాకు ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
Pawan Kalyan: ఇంద్రకీలాద్రికి పవన్ కల్యాణ్… ‘వారాహి’కి వాహన పూజ చేయించిన జనసేనాని
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుత కేంద్ర మంత్రి, బీజేపీ నేత అజయ్ మిశ్రా తనయుడు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, లఖీంపూర్ ఖేరి జిల్లా తికునియా వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా 2021, అక్టోబర్ 3న అప్పటి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న రైతులపైకి ఒక ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. నలుగురు రైతులు మరణించారు.
ఈ సమయంలో ఎస్యూవీ వాహనంలో ఆశిష్ మిశ్రా కూడా ఉన్నాడు. ఈ వాహనం రైతులపైకి దూసుకెళ్లేందుకు అతడే కారణమని రైతులు ఆరోపించారు. ఆయన చెప్పడం వల్లే డ్రైవర్ రైతులపైకి వాహనంతో దూసుకెళ్లాడని ఆరోపణలొచ్చాయి. ఈ ఘటన జరిగిన వెంటనే కోపోద్రిక్తులైన రైతులు వాహన డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు. దీంతో డ్రైవర్ మరణించాడు. అలాగే ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కూడా రైతులు దాడి చేయడంతో వాళ్లు కూడా ప్రాణాలో కోల్పోయారు. ఘటనను కవర్ చేస్తున్న జర్నలిస్టు కూడా ఈ దాడిలో మరణించారు. మొత్తం ఈ ఘటనలో రైతులతో కలిపి మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అయితే, అప్పట్లో ఆశిష్ మిశ్రా తప్పించుకున్నాడు.
PM Modi: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు మోదీ కానుక.. చాదర్ సమర్పించిన ప్రధాని
తర్వాత పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో ఆశిష్ మిశ్రా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అలహాబాద్ కోర్టు అతడికి గత జూలైలో బెయిల్ నిరాకరించింది. దీంతో ఆశిష్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై ఉన్నంత కాలం ఆశిష్ మిశ్రా ఢిల్లీలో కానీ.. ఉత్తర ప్రదేశ్లో కానీ ఉండరాదని ఆదేశించింది. ఎక్కడ ఉన్నా ఆ సమాచారం స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించింది. అలాగే సాక్షుల్ని ప్రభావితం చేయరాదని ఆదేశించింది.
