కుదరని ఏకాభిప్రాయం.. రైతు సంఘాలతో కేంద్రం చర్చలు విఫలం.. మళ్లీ ఎప్పుడంటే?
రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన మూడో దఫా చర్చలు విఫలం అయ్యాయి. పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు.
- Harishth Thanniru
- Published On : February 16, 2024 / 08:15 AM IST
Farmers Protest 2024
Farmers Protest 2024 : రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన మూడో దఫా చర్చలు విఫలం అయ్యాయి. పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఆదివారం రైతు సంఘాలతో నాల్గోసారి కేంద్రం చర్చలు జరపనుంది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
Also Read : Bharat Bandh : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్.. వీటికి మాత్రమే మినహాయింపు.. 21 డిమాండ్లు ఇవే
కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్ ముండా, సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లు, 14మంది రైతు సంఘాల నేతలతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మూడో విడత చర్చల్లో పాల్గొన్నారు. వీరి మధ్య దాదాపు ఐదు గంటలపాటు చర్చలు జరిగాయి. రైతులపై కేంద్ర ప్రభుత్వం బల ప్రయోగం సరికాదని రైతు సంఘాల నాయకుల దృష్టికి తీసుకెళ్లాయి. టియర్ గాస్ సెల్స్, బుల్లెట్లను కేంద్ర మంత్రులకు రైతు నాయకులు చూపించారు. ఇంటర్నెట్ సర్వీసులు, ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ పునరుద్ధరించాలని రైతులు కోరగా.. పంజాబ్ ప్రభుత్వం
అందుకు అంగీకరించింది.
Also Read : ఎలక్టోరల్ బాండ్ల పథకం ఎవరు ప్రవేశపెట్టారు.. సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది?
చర్చల అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులతో అన్ని అంశాలపై వివరంగా చర్చించామని తెలిపారు. ప్రభుత్వం.. డిమాండ్లను మరింత వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సమయం కావాలని కోరిందని, తదుపరి సమావేశం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మా చర్చలు సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఉన్నాయని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా శాంతియుత పరిష్కారం మేము ఆశిస్తున్నామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఢిల్లీ వెళ్లాలనే మా ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని చర్చలు కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత రైతు డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రులు తెలిపారని అన్నారు. వ్యవసాయం కార్పొరేట్ మయం అయితే అది దేశానికి మంచిది కాదని అన్నారు. రైతు ఆందోళనకు ప్రజలు సహకరించాలని, మాకు మద్దతుగా నిలవాలని రైతు సంఘాల నాయకులు కోరారు.
