కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురి మృతి.. శిథిలాల కిందే మరింత మంది
భవనం కూలిందన్న సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్..
- T Venkateshwarlu
- Published On : September 7, 2024 / 09:39 PM IST
Building collapse: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ట్రాన్స్పోర్ట్ నగర్లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులు ఇప్పటివరకు 28 మందిని రక్షించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మూడంతస్తుల భవనం కూలడంతో భవనం అక్కడ ఆగి ఉన్న లారీ కూడా నుజ్జునుజ్జయింది. ఆ భవనాన్ని యజమాని గోడౌన్గా ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
భవనం కూలిందన్న సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్)తో పాటు అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈఘటనపై స్పందిస్తూ గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. భవనం కూలిన ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ లో స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులకు సంబంధించి జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
Also Read: ఎన్టీఆర్ జిల్లాకు రూ.50 కోట్లు.. వరదలతో నష్టపోయిన జిల్లాలకు నిధులు విడుదల
